సందేహ నివారిణి
.jpg)
మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
09 Sep 2026
ప్రశ్న -:
పవిత్రాత్మకు వ్యతిరేకముగా చేసిన పాపములు క్షమింపబడవు అని వ్రాయబడి ఉంది. ఎందుకని అవి క్షమింపబడవు (మత్తయి 12:32)?
సమాధానము:
హృదయకాఠిన్యము కలిగిన యూదులతో యేసు ఈ మాటలన్నారు. వీరు ఆయన సమకాలీనులు (మార్కు 4:12). యూదులు దేవునిచే ఎన్నుకొనబడినవారు ప్రత్యేక ప్రజలు, అయినా దేవుడు స్పష్టముగా బయల్పరచిన సత్యాలను ఒప్పుకొనడానికి నిరాకరించారు.అది వారి పాపం.ఆ పాపం దైవకుమారుడైన యేసుక్రీస్తును తృణీకరించడంతో పరాకాష్టకు చేరుకొంది.యేసుక్రీస్తును, ఆయన మానవ రక్షణ ప్రణాళికను వారు అంగీకరించ లేదు.ఆయన వారు నమ్మిన దేవుని కుమారుడని స్పష్టమైన సంకేతాలు ఆయన వైపే మొగ్గుచూపాయి.అయినా వారి అహంభావం, గర్వం వారి కళ్ళను మూసేశాయి.వీరిలోని పరిసేయవర్గం ఇందుకు ప్రధాన కారణం. వీరూ, మిగిలిన యూదులు, యేసుక్రీస్తును నమ్మకపోవడమే కాకుండా, ఆయన శక్తిని సైతానుశక్తికి అంటగట్టారు (మార్కు 3:22). ఆయన చేసిన ఎన్నో నమ్మదగిన కార్యాలను హేళన చేశారు. తెలియజేయబడిన సత్యాన్ని విసర్జించి, నమ్మకపోవడం, పవిత్రాత్మవైపు పాపం చేసినట్లే.ఎందుకంటే సత్యానికి సృష్టికర్త పవిత్రాత్మ. అటువంటి పాపం క్షమించబడదు.కారణం, క్షమను ఆశించేవారు, క్షమకు అర్హులు కావాలి.వారి హృదయకాఠిన్యంతో క్రీస్తును స్వీకరించే స్థితిలో వారులేరు. అందుకనే దైవ క్షమను పొందలేక పోయారు. సత్యానికి సాక్షి పవిత్రాత్మ.అటువంటి పవిత్రాత్మను విస్మరించేవారు క్షమను పొందలేరు.
