నిజమైన ఆనందానికై దేవుని దీనతతో వేడుకొందాము

జోసెఫ్ అవినాష్
08 Sep 2026
సామాన్య 23వ బుధవారం
సువిశేష ధ్యానం
లూకా 6:20-26
ఈనాటి సువిశేష భాగంలో నాలుగు ఆశీర్వాదములు, నాలుగు అనర్థాలు చూస్తున్నాం.మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఇదే ప్రసంగం పర్వతంపై ఇవ్వబడింది. దీనిని "అష్టభాగ్యములు /పర్వత ప్రసంగము" అని పిలుస్తారు. లూకా సువార్తలో ఈ ప్రసంగము చిన్నదిగాను మరింత క్లిష్టమైనదిగాను ఉంది. దీనాత్ములు ధన్యులు అనగా, అహమును తగ్గించుకొని జీవించే వారు ధన్యులని అర్థం. భౌతిక సంపదపై ఆధారపడని క్రైస్తవుడు తన స్వంత అభిప్రాయాలలో మొండిగా ఉండని వ్యక్తి ఇతరులపట్ల మర్యాదగా ప్రవర్తించి, వారి భావాలను సమాధానముగా, గౌరవప్రదంగా వినే వ్యక్తి ధన్యుడని దీని అర్థం. మన కుటుంబాల్లోనూ, మన సమాజాల్లోనూ మనమందరము ఇటువంటి దీనత్వమును కలిగి ఉంటే విభేదాలు,వివాదాలు తక్కువగా ఉంటాయి. సభ్య సమాజంలో మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజాలలో ఇతరులతో కలిసి జీవించటానికి దాతృత్వంతో కూడిన వినయం ఎంతో అవసరమౌతుంది.ఎప్పుడైతే మనము దీనత్వము కలిగివుంటామో మన జీవితములో పూర్వానందం పొందగలం.మనమందరము సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు,సంతోషంగా ఉండాలంటే దేవుని దీవెనలు చాలా అవసరం.ఆ ఆనందము డబ్బులోనో, పెద్ద ఇంటిలోనో, కారులోనో, మద్యంలోనో లేదా డ్రగ్స్ లోనో పొందలేము.కన్నీళ్ల నుండి మనలను మనం త్యజించుకొనుట నుండి మనము ఆ ధన్యతను పొందగలం. కన్నీళ్లు లేని ఆనందం అబద్దపు ఆనందము. కాబట్టి నిజమైన ఆనందానికై దేవుని దీనతతో వేడుకొందాము.
