సువార్త మార్గంలో శాంతి కోసం పోప్ లియో XIV పిలుపు
వాటికన్ వార్తా విభాగం
22 Aug 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV తన అపోస్తలిక పర్యటనలో భాగంగా శాన్ మారినో లో పర్యటిస్తున్నారు.అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ప్రపంచంలో కొనసాగుతున్న యుద్ధాలు,సంఘర్షణలు,విభేదాల నేపథ్యంలో క్రైస్తవులు సువార్త మార్గాన్ని అనుసరించడం ద్వారా స్పందించాలని పిలుపునిచ్చారు.సువార్త మనిషికి నిజమైన స్వేచ్ఛను, శాంతిని,సోదరభావాన్ని అందించే మార్గమని ఆయన అన్నారు. శాన్ మారినోకు క్రైస్తవ విశ్వాసాన్ని అందించిన పునీతుల సాక్షాన్ని గుర్తుచేస్తూ,వారి విశ్వాస వారసత్వాన్ని నేటి తరాలు కొనసాగించాలని కోరారు.ముఖ్యంగా యువత తాత్కాలికమైన,పరిమితమైన లక్ష్యాలతో సంతృప్తి చెందకుండా దేవునితో సంబంధంలో తమ జీవితానికి నిజమైన అర్థాన్ని కనుగొనాలని సూచించారు.వివాహం, పౌరోహిత్యం,అంకిత జీవితం,వృత్తి,సమాజ సేవ వంటి జీవిత పిలుపులను ధైర్యంగా స్వీకరించి, ప్రపంచంలో శాంతికి సాక్షులుగా నిలవాలని యువతను ప్రోత్సహించారు.అలాగే తల్లిదండ్రులు తమ విశ్వాసాన్ని జీవితం ద్వారా పిల్లలకు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాలని,పిల్లల విశ్వాస వికాసానికి కుటుంబం, గురువులు, ఉపదేశులు కలిసి పనిచేయాలని అన్నారు.యుద్ధాలు,హింస,విభజనలు పెరుగుతున్న సమయంలో వాటికి హింసతో సమాధానం ఇవ్వకుండా ప్రేమ,సేవ, క్షమ,సోదరభావం ద్వారా స్పందించాలని పోప్ కోరారు.వ్యక్తివాదం,అనుమానం, విభజనలను అధిగమించి సమైక్యతతో కూడిన సమాజాన్ని నిర్మించడం ప్రతి క్రైస్తవుని బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.
