మానవ గౌరవాన్ని కాపాడేలా కృత్రిమ మేధస్సును వినియోగించాలి: పోప్ లియో XIV
వాటికన్ వార్తా విభాగం
21 Aug 2026
వాటికన్ జగద్గురువుని పరిపాలన యంత్రాంగములో వివిధ విభాగాలలో సేవలందిస్తున్న అధికార ప్రతినిధులను ఉద్దేశించి పోప్ లియో XIV మాట్లాడుతూ,కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో మానవ గౌరవం, హక్కులు, స్వేచ్ఛలు మరియు కుటుంబ విలువలను కాపాడటం అత్యంత ముఖ్యమని అన్నారు.సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి మానవాళికి మేలు చేసే దిశగా సాగాలని, దాని వల్ల మనిషి కేవలం ఒక సమాచారం లేదా సంఖ్యగా మారకూడదని సూచించారు.AIపై సమర్థవంతమైన చట్టాలు, బాధ్యతాయుతమైన పర్యవేక్షణ అవసరమని,సాంకేతిక పురోగతి పేరుతో పేద దేశాలపై కొత్త రకాల ఆధిపత్యం ఏర్పడకూడదని హెచ్చరించారు.అల్గారిథమ్లు ప్రజల జీవితాలను,అభిప్రాయాలను లేదా అవకాశాలను అన్యాయంగా ప్రభావితం చేసే పరిస్థితులను నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు.ఈ నేపథ్యంలో కుటుంబమే మానవత్వాన్ని నేర్పించే తొలి పాఠశాల అని పోప్ పేర్కొన్నారు.కుటుంబంలోనే మనిషి ప్రేమ,విశ్వాసం, ఔదార్యం,సంభాషణ మరియు పరస్పర గౌరవం వంటి విలువలను నేర్చుకుంటాడని చెప్పారు.అందువల్ల వివాహం మరియు కుటుంబాలను బలోపేతం చేసే విధానాలను ప్రోత్సహించాలని,యువతను సాంకేతిక ప్రపంచంలోని హానికరమైన ప్రభావాల నుంచి కాపాడుతూ,వారు మానవీయ విలువలతో కూడిన భవిష్యత్తును నిర్మించుకునేలా సహకరించాలని వారిని కోరారు.కృత్రిమ మేధస్సు మనిషికి ప్రత్యర్థిగా కాకుండా,మానవ సమాజ శ్రేయస్సుకు సేవ చేసే సాధనంగా మారినప్పుడే నిజమైన సాంకేతిక పురోగతి సాధ్యమవుతుందని పోప్ లియో XIV స్పష్టం చేశారు.
