ప్రతి ఆదివారం ఒక చిన్న ఈస్టర్ పండుగ లాంటిదే - పోప్
జోసెఫ్ అవినాష్
12 Aug 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV బుధవారం సాధారణ ప్రేక్షకుల సమావేశంలో దైవార్చన సంవత్సరం గురించి వివరిస్తూ,అది గతంలో జరిగిన క్రీస్తు రక్షణ కార్యాలను కేవలం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదని,క్రీస్తు రక్షణ రహస్యాన్ని ప్రతి విశ్వాసి తన జీవితంలో సజీవంగా అనుభవించేలా చేసే ఆధ్యాత్మిక ప్రయాణమని అన్నారు.దైవార్చన సంవత్సరంలోని వివిధ కాలాలు,పండుగలు,ప్రార్థనా వేడుకల ద్వారా విశ్వాసులు క్రీస్తు జననం,ఆయన శ్రమలు,మరణం, పునరుత్థానం వంటి రక్షణ రహస్యాలలో మరింత లోతుగా పాలుపంచుకుంటారని తెలిపారు.ప్రతి ఆదివారం క్రీస్తు పునరుత్థానాన్ని స్మరించే చిన్న ఈస్టర్ పండుగ వంటిదని, అందుకే ఆదివారం దైవార్చన సంవత్సరానికి పునాది మరియు క్రైస్తవ జీవితానికి కేంద్రబిందువని పోప్ పేర్కొన్నారు.పవిత్ర దివ్యబలిపూజలో పాల్గొనడం ద్వారా దేవుని వాక్యాన్ని ఆలకించి,దివ్య సత్ప్రసాదంలో క్రీస్తుతో ఐక్యమై,విశ్వాస సమాజంగా జీవించే పిలుపును మనం మరింతగా గ్రహిస్తామని ఆయన గుర్తుచేశారు.దైవార్చన సంవత్సరం కాలక్రమేణా అభివృద్ధి చెంది ఈస్టర్,పెంతెకోస్తు, తపస్సు కాలం, క్రిస్మస్ వంటి ప్రధాన పండుగలతో పాటు మరియతల్లి మరియు పునీతుల పండుగలను కూడా తనలో చేర్చుకుందని వివరించారు.చివరగా, దైవార్చన సంవత్సరం మనలను కేవలం పండుగలను జరుపుకునేలా చేయడం కాకుండా,క్రీస్తు రక్షణ కార్యంలో ప్రతిరోజూ మరింత లోతుగా జీవించేలా నడిపించే శ్రీసభ యొక్క ఆధ్యాత్మిక మార్గం అని పోప్ లియో XIV స్పష్టం చేశారు.
