యేసు బాప్తిస్మానికి 2,000 ఏళ్లు: చారిత్రక వేడుకలకు జోర్డాన్ సిద్ధం
జోసెఫ్ అవినాష్
11 Aug 2026
యేసుక్రీస్తు పునీత బాప్తిస్మ యోహాను చేత బాప్తిస్మం పొందిన పవిత్ర సంఘటనకు 2030లో 2,000 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో జోర్డాన్ దేశం ఇప్పటి నుంచే ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది.యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన ప్రదేశంగా క్రైస్తవ సంప్రదాయంలో విశ్వసించబడే జోర్డాన్ నదీ తీరంలోని అల్-మఘ్తాస్ ప్రాంతంలో ఈ చారిత్రక సందర్భాన్ని ఘనంగా నిర్వహించేందుకు జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు.జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు క్రైస్తవ మత నాయకులు పాల్గొన్నారు.ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే యాత్రికులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ప్రత్యేక యాత్రికుల గ్రామం,యేసు బాప్తిస్మానికి అంకితమైన మ్యూజియం,పచ్చదారులు,ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.యేసు బాప్తిస్మం జరిగిన పవిత్ర స్థలాన్ని ప్రపంచ క్రైస్తవులకు మరింత చేరువ చేయడంతో పాటు,ఈ వేడుకల ద్వారా శాంతి,ప్రేమ,పరస్పర గౌరవం,సహజీవనం, మానవ సోదరభావం వంటి సువార్త విలువలను ప్రపంచానికి చాటాలని జోర్డాన్ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.
