అంతోని వారి రొట్టెలు

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
28 Jul 2026
ప్రతి మంగళ వారం మనం పునీత అంతోని వారి పేరిట జరిగే పూజా ప్రార్ధనల్లో పాల్గొనడానికి దేవాలయాలకు వెళ్లడం, అక్కడ కొందరు రొట్టెలు తెచ్చి పూజలో సమర్పించిన తరువాత వాటిని అందరికి పంచి పెట్టడం చూస్తుంటాము. అంతోని వారి పేరిట ఇలా రొట్టెలు పంచే ఆచారం ఎలా వచ్చిందంటే ------
అంతోని వారి రొట్టెలు!
**--**-*---*********
క్రీస్తు శకం 1263 వ సంవత్సరంలో పాదువా పట్టణం లోఅంతోని వారి దేవాలయం నిర్మాణం జరిగే కాలంలో ఒక రోజు, ఆ దేవాలయపు దరిదాపుల్లో ఆడుకుంటూ ఉన్న ఒక చిన్న బాలుడు ప్రమాద వశాత్తు నీటి గుంటలో పడి మునిగిపోగా, అతని తల్లి అంతోని వారిని ప్రార్ధించి, తన బిడ్డను తనకు దక్కిస్తే, ఆ బిడ్డ బరువుకు సమానమైన గోధుమలను పేదలకు పంచి పెడతానని మొక్కుకున్నదట. వెంటనే నీట మునిగిన బాలుడు అద్భుతంగా ఆ తల్లి ముందు ప్రత్యక్షమయ్యాడట.
అదే విధంగా, ఫ్రాన్స్ దేశంలో "లూయిస్ బౌఫియెర్ " అనే వనిత తను నిర్వహించే రొట్టెల షాపు తలుపుకు వేసిన తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నదట. తాళాలు బాగు చేసే వాళ్ళను పిలిచి ఎంత ప్రయత్నించినా తాళం రాకపోయే సరికి, చివరకు అంతొని వారి సహాయం కోసం ప్రార్ధించి మరొక్క సారి ప్రయత్నించగా, తాళము సులువుగా వచ్చిందట.డానికి కృతజ్ఞతగా ఆమె షాపులోని రొట్టెలన్నీ పేదలకు పంచి పెట్టిందట.
ఆ విధంగా అంతోని వారు చేసిన మేలులకు కృతజ్ఞతగా రొట్టె లను దేవాలయం లో సమర్పించి, వాటిని ఇతరులకు పంచిపెట్టే ఆచారం మొదలైంది.
ఒక్క రొట్టెలే కాకుండా, ధన ధాన్యాదులు దానం చేసే పద్దతిని భక్తులు అంతోని వారి పండగ రోజుల్లో ఆచరిస్తూ ఉంటారు. అంతోని వారి అనుగ్రహం పొందిన వారు కృతజ్ఞతా పూర్వకంగా చేసే ఈ దానాన్నే "St. Anthony's Bread " అంటున్నారు.
