పునీత మగ్దల మరియ స్మరణ, జూలై 22

Father gopu praveen
21 Jul 2026
మగ్దల మరియ యేసు ప్రభువును అనుసరించన వారిలో ప్రత్యేక స్థానాన్ని పొందినట్లుగా సువార్తలన్ని కూడా చాటుతున్నాయి. ఆమె గలిలీయ సరస్సు తీరమున ‘తిబేరియా’ పట్టణం దరిలోనున్న ‘మగ్దల’ అను గ్రామమునుండి అని ఆమె పేరును బట్టి తెలియుచున్నది.
మగ్దల మరియ గురించి లూకా సువార్తలో (పేరు చెప్పబడలేదు) చూడవచ్చు. పరిసయ్యులలో ఒకరు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందులకు అంగీకరించి, పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఒక స్త్రీ, పాపాత్మురాలు (ఆమె వ్యభిచారి అని అర్ధం కాదు!), చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసికొని వచ్చి, ఆయన పాదముల వెనుకగా నిలువబడి, ఏడ్చుచు, తన కన్నీటితో ఆ పాదములను తడిపి, తలవెంట్రుకలతో తుడిచి, ముద్దుపెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను (7:36-49). “సమస్త ప్రపంచము నందు ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో, అచ్చట ఈమె చేసిన కార్యము ఈమె జ్ఞాపకార్ధము ప్రశంసింపబడునని నిశ్చయముగా చెప్పుచున్నాను” (మత్త. 26:13) అని యేసు అన్నాడు.
యేసుచేత ఏడు దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దల అనబడు మరియమ్మ ఈమెయే! (లూకా. 8:2). యేసు సిలువచెంత నిలచిన స్త్రీలలో మగ్ధలేన మరియమ్మ కూడా ఉన్నారు (మత్త. 27:56; మార్కు. 15:40; యోహాను. 19:25). పునరుత్థానుడైన క్రీస్తు మొదటిగా దర్శన మిచ్చినది మగ్ధలా మరియమ్మకే అని సువార్తలలో (మత్త. 28:1-10; మార్కు. 16:9-11; లూకా. 24:10; యోహాను. 20:11-18) చదువుచున్నాము. యేసు ఉత్థానమైన శుభవార్తను శిష్యులకు తెలిపినది. అందుకే పునీత థామస్ అక్వినాసు, “అపోస్తలులకే అపోస్తలురాలు” అనే బిరుదును ఆమెకు ఇచ్చారు. .
వీటన్నింటిని బట్టి, మగ్ధల మరియమ్మ ప్రభువును ప్రేమతో అనుసరించినది. తన పాప జీవితానికి పశ్చాతాప పడి, దేవుని గొప్ప కరుణ, కృపకు నోచుకొని పుణ్య జీవితాన్ని జీవించినది. ప్రభువును ఆశ్రయించు వారికి ఆయన కృప తప్పక లభించునను నమ్మకము మనకు కలుగజేస్తుంది.
2016లో పోపు ఫ్రాన్సిస్, 22 జూలైన మగ్దల మరియమ్మ స్మరణను ఉత్సవముగా కొనియాడాలని తీర్మానించారు.
