బైబిలులోని కీర్తనలన్నీ దావీదే వ్రాశాడా? ఇతర రచయితలెవరైనా ఉన్నారా?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
27 Jun 2026
శతాబ్దాల తరబడి కీర్తనలు అటు యూదులకు, ఇటు క్రైస్తవులకు దినదిన ప్రార్థనలయిపోయాయి. బైబిలులో అతి ప్రియంగా ప్రేమించే భాగంగా కీర్తనల గ్రంథం భక్తుల హృదయాలలో నిలిచిపోయింది. అందులో హృదయాన్ని కదిలించే ప్రార్థనలు పలురకాలు.ఉదాహరణకు కొన్ని, కృతజ్ఞతా ప్రార్ధనలు,విన్నపాలు, స్తుతిగీతాలు, ఆత్మ ప్రబోధాలు,హృదయాక్రందనలు మొదలగునవి.దావీదు మహారాజే ఈ కీర్తనలన్నీ రచించినట్లు ఒక అపోహ ఉంది. ఈ అభిప్రాయానికి కారణాలు లేకపోలేదు.
1.మొదటికారణం, దావీదు మహారాజు స్వయానా సంగీత పరిజ్ఞానం కలవాడు (1 సమూ 16:18-23) కవి (2 సమూ. 1:19-27) ఇశ్రాయేలు అర్చన విధానంలో దైవార్చన ఆరాధనలను క్రమబద్ధీకరించినవాడు (2 సమూ.6:18-23)
2. రెండవ కారణం, కొన్ని కీర్తనలు దావీదు జీవిత ఘట్టాలను తలంపునకు తెస్తాయి.ఉదాహరణకు 23వ కీర్తన, మొదట గొర్రెలకాపరియైన దావీదు,దేవున్ని కాపరిగా అభివర్ణిస్తూ కీర్తించిన గీతం.ఈ కీర్తన ఒక అద్భుత భావకల్పన. మరొకచోట,తాను పరాయి స్త్రీ సాంగత్యాన్ని కోరుకొని పాపం చేసిన తరువాత,పశ్చాత్తాపపడి దుఃఖించిన విధానం హృదయాన్ని కలచివేస్తుంది (కీర్తన 51). పండితుల అభిప్రాయాన్ననుసరించి, కీర్తనలలో సింహభాగం దావీదే రచించి ఉండాలి.స్వతహాగా సంగీత, సాహిత్య పరిచయాలు గల దావీదుకు,అది సహజంగా సంక్రమించి ఉండవచ్చు.అయితే కీర్తనలను ఇంకా మరికొందరు, వివిధ సందర్భాలలో,వివిధ సాహిత్య ప్రక్రియలలో రచించారు. దావీదు ఒక రాజు, కవి,సంగీతజ్ఞుడు కాబట్టి చాలా వరకు ఆయనకే చెందినట్లు చెప్పుకొచ్చారు.కానీ కీర్తనలు రచించినవారు మరికొందరున్నారు.
ఈ క్రింది పట్టికలో ఎవరు ఎన్ని కీర్తనలు రచించారో వివరించబడింది:
దావీదు-73
అసఫ్- 12
కోరా కుమారులు-12
మోషే-1
సొలోమోను-2
ఈతాను-1
హేమాను-1
గుర్తుతెలియని రచయితలు-48
మొత్తము-150
