నేటి పునీతులు: పునీత ఫ్రాన్సిస్ కరాచియోలో

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
04 Jun 2026
ఇటలీ దేశంలోని అబ్రుజ్జిపట్టణంలో ఒక గొప్పయింటిలో పునీత ఫ్రాన్సిసు కరాచియోలో క్రీ||శ|| 1563లో పుట్టారు. వారు పెరిగి యువకుడు అయ్యేసరికి వారికి పట్టిన కుష్ఠవ్యాధి ముదిరిపోయింది. ప్రజలు ఆ రోగపు దుర్వాసన అసహ్యతకు ఊరిబైటకుపోయి ఉండమని తిట్టేవారు. అయితే ఫ్రాన్సిస్ గారు తమ 22వ ఏట తననుతాను దైవంకు అర్పించుకొని, అధికంగా దేవుని ప్రార్థించి తనకు బాగైతే ప్రజల్లో తిరిగి దేవుని సేవలోనే జీవిస్తానని మ్రొక్కుకున్నారు.
దేవుని కృపవల్ల ఫ్రాన్సిసుగారి వ్యాధి అకస్మాత్తుగా పూర్తిగా నివారితమైంది. వెంటనే వారు నేపుల్సనగరం వెళ్లి వేదాంతవిద్యను పఠించి క్రీ||శ|| 1587లో పవిత్ర గురుపట్టాభిషేకం పొందారు. పిమ్మట అదోర్నో అను ఒక మిత్రుని తోడ్పాటులో క్రీ||శ|| 1589లో 'మైనర్ క్లర్క్స్ రెగ్యులర్' అను ఒక మతపరమైనసభను స్థాపించారు. ఈ సభ ధ్యానము- సేవను ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. ఇందుచేరువారు మతపరమైన ఆధిపత్యహోదాలను ఆశింపరాదు. జపము తపముతోపాటు దివ్య సత్ప్రసాద నిత్యారాధనా కార్యక్రమంలో పూర్తి అందుబాటులో ఉండాలి. విధేయత, విరక్తత్వము, దారిద్య్రమనే వ్రతదీక్షతో పాటు సత్ప్రసాదభక్తి కూడ ఒక వ్రతంగా పెట్టు కున్నారు. ఈ బ్రదర్ల సభ కు తొలిసుపీరియరుగా ఫాదర్ ఫ్రాన్సిస్ కరాచియోలోగారే బాధ్యతలు నిర్వహించారు. స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్, వల్లడోలిడ్, ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఉన్న అల్కాల పట్టణాల్లో కూడ తమ సభ గృహాల్ని ప్రారంభించారు. ఈ సభికులు తాము ఉన్నచోట కుష్ఠి, బొల్లు మరియు ఇతర వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సామాన్య శాస్త్రం (సైన్సు) అంశాల పై బోధనచేపట్టారు.
పునీత తోమాస్ అక్వినాస్ (జనవరి-28 చూడండి) గారు తల్లితరఫున ఫ్రాన్సిసుగారికి పూర్వీకులు. ఆ సాలుపోకుండ వీరికి దేవదూతను పోలిన పరిశుద్ధతను పాటించేతత్వం అబ్బింది. పేదల సేవలో ఉంటూనే పూర్తి సన్యాసిగురుత్వ జీవితంలో ఎక్కడకు వెళ్లినా కాలినడకనే వెళ్తూ, ఆకలైనప్పుడు ఇంత భిక్షం అడుక్కుని తినడం పరిపాటి అయ్యింది.
దేవుడు ఫ్రాన్సిసుగారికి భవిష్యత్తు చెప్పకలిగే వరాల్ని, ఎదుటి వారి హృదయాలోచనల్ని చదవకలిగే శక్తి వరాన్ని అనుగ్రహించారు. ఒక ఆథ్యాత్మికరచయితగా ఏసుక్రీస్తు పాటుల ఏడుస్థలాలు' పుస్తకం వ్రాశారు. తమ 45వ ఏట క్రీ||శ|| 1608 జూన్ 4న శాశ్వతంగా కన్ను మూశారు. 1807 మే 24న 7వ పయస్ పోపుగారిచే పునీతునిగా ప్రకటింపబడినారు
