విజ్ఞానంలో జీవిద్దాం

జోసెఫ్ అవినాష్
01 Jun 2026
సామాన్య 9వ మంగళవారం
సువిశేష ధ్యానం :-
మార్కు 12:13-17
ప్రతి వ్యక్తియు పై అధికారులకు లోబడి ఉండవలెను.ఏలయన దేవుని అనుమతిలేనిదే ఏ అధికారం ఉండదు.ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదవులలో ఉంచబడినారు. కనుక ఎవరికి చెల్లించవలసినది వారికి చెల్లింపుడు" (రోమీ 13: 1,7).
నేటి సమాజంలో కొందరు ప్రతి సమయంలో ప్రతి విషయంలో ఎదుటి వారి పనిని,మాటలను వక్రీకరించి చూస్తుంటారు. ఈనాటి సువిశేషంలో కూడా కొందరు పరిసయ్యులు, హేరోదీయులు యేసును మాటలలో చిక్కించుకోవాలని సౌంకాన్ని గూర్చిన సమస్యను ప్రశ్నించారు.వీరందరికి యేసుప్రభువు మాటలు, పనులు తెలియనివి కావు. కానీ చిక్కు ప్రశ్నల ద్వారా ఆయన కీర్తిని కొద్దిగైనా తగ్గించాలని ప్రజలలో ఆయనకున్న పట్టును,బలాన్ని బలహీనపరిచి ఆయనను అవమానపరచాలని చూసారు. కానీ యేసుప్రభువు చాల చక్కగా సమాధానమిచ్చాడు. నాణాలపై సీజర్ బొమ్మ ముద్రించి ఉంది.ప్రజలు వాటిని ఉపయోగించి క్రయవిక్రయాలు చేసుకుంటున్నారు.పరిసయ్యులు ఇష్టమున్నా లేకపోయినా ఆ డబ్బును వినియోగించడం ద్వారా వారు సీజరు అధికారాన్ని ఒప్పుకున్నారు. అయితే మనుషులందరి మీద దేవుని ముద్ర ఉంది.ఆయన వారిని తన రూపంలో చేసారు. మానవులందరు ఆయన సొత్తు. “దేవుడు మానవజాతిని సృష్టించాడు.తనను పోలునట్లు మానవుని చేసాడు. స్త్రీ పురుషులుగా మానవుని సృష్టించాడు" (ఆది 1:27) కాబట్టి మానవులందర ఆయన అధికారానికి లోబడాలి. మానవ సమాజాన్ని,మానవ ప్రభుత్వాన్ని దేవుడు మన కొరకే ఏర్పరిచాడు.కావున అధికారంలో ఉన్న మనుషులు మనకు నచ్చినా నచ్చకపోయినా అధికారాన్ని మాత్రం మనం గౌరవించాలి. కావున ప్రతి మనిషి “అతి” అనే స్వభావాన్ని వీడి అజ్ఞానంలో పరిసయ్యుల వలె జీవింపక విజ్ఞానులై ఆయా పరిస్థితులను బట్టి ప్రశ్నించడం మానేసి పరిస్థితిని ప్రదర్శించి జీవించాలి.మరి మనం అన్నీ తెలిసి మూర్ఖులుగా జీవిస్తున్నామా? ఆలోచించుకుందాం.
