వరంగల్ పీఠానికి నూతన పీఠాధిపతులుగా ఎన్నికైన గురుశ్రీ దుగ్గింపూడి విజయ పాల్ రెడ్డి

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
09 May 2026
రోమ్ వేదికగా,విశ్వకాపరి పోప్ లియో XIV పూజ్య గురువర్యులు ఫాదర్ దుగ్గింపూడి విజయ పాల్ రెడ్డి (61)గారిని వరంగల్ కతోలిక పీఠానికి నూతన పీఠాధిపతిగా ప్రకటించారు.ఇంతకుముందు ఇదే పీఠానికి విజయ పాల్ రెడ్డి గారు అపోస్తలిక పాలనాధికారిగా తన విశిష్ట సేవలందించారు.ఫాదర్ విజయ పాల్ గారు 1965 జనవరి 8న తెలంగాణలోని మనుగొండ గ్రామంలో రాయప్ప రెడ్డి, ఆగ్నేసమ్మ దంపతులకు జన్మించారు.చిన్ననాటి నుంచే దేవుని సేవ పట్ల ఆకర్షణ కలిగి,గురుత్వ జీవితానికి అవసరమైన విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు.తరువాత తత్వశాస్త్రం, దైవశాస్త్రం మరియు ఇతర ఉన్నత విద్యలను అభ్యసించి శ్రీసభ సేవా పరిచర్యకు తనను తాను సిద్ధం చేసుకున్నారు.
1992 ఏప్రిల్ 2న గురువుగా అభిషేకం పొందిన ఆయన,ఎన్నో సంవత్సరాలుగా ఆదర్శ గురువుగా సేవ చేస్తూ,విశ్వాసులను దేవుని మార్గంలో నడిపిస్తూ,విద్యా మరియు వివిధ శ్రీసభ సేవా విభాగాలలో విశేష సేవలందించారు.ఇంతకుముందు వరంగల్ పీఠాన్ని నడిపించిన పీఠాధిపతులు మహా ఘన శ్రీ. ఉడుమల బాల తండ్రిగారు 2025 లో విశాఖ అగ్ర పీఠానికి పీఠ కాపరిగా బదిలీ అయిన తరువాత,ఈ నూతన నియామకం జరిగింది.ఈ నియామకం వరంగల్ పీఠానికి ఎంతో సంతోషాన్ని తెచ్చి పెట్టింది. నూతన పీఠ కాపరి గురు శ్రీ విజయపాల్ రెడ్డి గారు దైవ,మానవ సేవలో వర్ధిల్లుతూ, పీఠాన్ని ప్రగతి పథంలో నడిపించాలని, దేవుడు మంచి ఆయురారోగ్యాలను, జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.
