పవిత్రాత్మ మనకు అంత:ర్గత శాంతిని ఒసగును
.jpg)
Father gopu praveen
03 May 2026
పాస్కా ఐదవ సోమవారము
అ.కా. 14:5-18; యోహాను 14:21-26
ధ్యానం: పవిత్రాత్మ
పవిత్రాత్మ ద్వారా క్రీస్తు సాన్నిధ్యం మనకు వాగ్ధానము చేయబడినది. కుమారుని ద్వారా తండ్రితో అత్యంత సన్నిహిత సంబంధాన్ని కలిగియుండుటకు ప్రియశిష్యునికి పవిత్రాత్మ తోడ్పడును. ప్రియశిష్యునిలో దేవుడు తన నివాసమును ఏర్పరచు కొనును. దేవున్ని మరియు ఇతరులను షరతులు లేకుండా ప్రేమించువాడే ప్రియశిష్యుడు. తండ్రి దేవుడు కుమారుడు యేసును, యేసు మనలను ప్రేమించునటుల, మనము కూడా పరస్పరము ప్రేమించు కొనవలయును. దేవుని చిత్తమును నెరవేర్చుట ద్వారా లేదా దేవుని ఆజ్ఞలను స్వీకరించి పాటించుట ద్వారా, ఇలాంటి ప్రేమను మనం ప్రదర్శించాలి. “నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అపుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము” (యో 14:23). అలాంటి ప్రియశిష్యునిలో దేవుడు నివాస మేర్పరచు కొనును. దేవుడు మనలో వసించాలంటే, మన హృదయాలు పాపమునుండి శుద్ధిగావింప బడాలి. సువార్తల ద్వారా దేవుని వాక్కును చాలా జాగ్రత్తగా ఆలకించడం ఎంతో ముఖ్యము.
తండ్రి దేవుడు పంపు పవిత్రాత్మ మనకు సమస్త విషయములను బోధించును (యో 14:25-26). పౌలు అంటారు, “ఆత్మ మనకు సాయపడును. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్ధించును” (రోమీ 8:26). పవిత్రాత్మ మనకు అంత:ర్గత శాంతిని ఒసగును.
