జీవాహారం ప్రభువు మనకు ఇచ్చినా ప్రేమాహరం

జోసెఫ్ అవినాష్
23 Apr 2026
పాస్కా 3వ గురువారం
అ.కా 8:26-40
కీర్తన 66:8-9,16-17,20
యోహాను 6:44-51
ధ్యానం:
సైఫాను అయినా ఫిలిప్పు అయినా ఏ ఇతర తొలి క్రైస్తవ సభ్యుడైనా,తమను పిలిచిన ప్రభుని మనసున నిలుపుకొని, ఆయన శరీరరక్తాల ఆధ్యాత్మిక భోజనంతో సంతృప్తులై "మీరు లోకమంతా తిరిగి సువార్తను బోధింపుడు" అని ఆయన చివరి ఆజ్ఞకు బద్దులై సువార్తను బోధించారు. 'తమను ప్రత్యేకంగా ఎన్నిక చేసింది భోజన పంక్తిలో అందరికి శారీరక భోజనాన్ని సమానంగా పంచుతూ వారు అవసరాలను తీర్చేందుకే' పరిమితం కాకుండా దైవం తమను ఆయన సాక్షులుగా నిలిచేందుకు పిలిచాడు అని గుర్తించి ఆ పిలుపును సువార్త పరిచర్య ద్వారా సార్థకత చేకూర్చారు.
ఏడుగురు డీకన్లలో ఒకడైన సైఫాను దైవ తనయునికి సాక్ష్యమిస్తు మృతిచెందినా మొక్కవోని విశ్వాసంతో మిగిలిన వారు అదే విధంగా సాక్షమిచ్చారు.మరీముఖ్యంగా ఫిలిప్పు ఇథియోపియా నివాసి నపుంసకనుకి “సేవక గీతం' అర్ధాన్ని, ఆ గీతం ఉద్దేశాన్ని తెలిపి జ్ఞానస్నానం ద్వారా ఆ ఉద్యోగిని క్రీస్తు అనుచరునిగా మలిచాడు.మన జీవితాలు సర్వం క్రీస్తుమయంలో రూపుదాల్చినపుడు "జీవించు వాడను నేను కాదు నా క్రీస్తే" అని విశ్వసించి దైవాన్వేషణకై పరితపించే ప్రజల చెంతకు ఆత్మ దేవుడే మనలను నడిపిస్తాడు.వాక్య పరిచర్య ద్వారా వారిలోని చీకటిని పారద్రోలుతూ పాస్కు వెలుగులను వారిలో నింపేందుకు మనలను వినియోగిస్తారు అని సైఫాను, ఫిలిప్పు జీవితాలు తెలియజేస్తున్నాయి.
"సైఫాను,ఫిలిప్పు మిగిలిన శిష్యులు "జీవాహారాన్ని నేనే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమిదే. దీని భుజించు వాడు మరణించడు" అని ప్రభువు పలికిన పలుకులను విశ్వసించి,ఆ ఆహారాన్ని భుజించి ఆయనకు సాక్షులుగా నిలిచారు.ఇతరులు కూడా సాక్షులుగా నిలిచేందుకు పిలిచారు.చివరకు అసువులు బాసి శాశ్వత భోజన పంక్తిలో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు.
మన ఆధ్యాత్మిక శత్రువులను జయించుటకు యేసు శరీరరక్తాలు భుజించాలి.అవి మనకు కావలసిన శక్తిని సమకూరుస్తాయి.కనుక తగిన సన్నద్ధతతో దివ్యపూజలో పాల్గొనడం,దివ్య భోజనాన్ని స్వీకరించడం చేయాలి. ఆయన సాక్షులుగా సాగిపోవాలి.
