'బలి అర్పించుట కంటే విధేయత మిన్న'

జోసెఫ్ అవినాష్
15 Apr 2026
పాస్కా 2వ గురువారం
అ.కా 5:27-33
కీర్తన 34:2-9,17-20
యోహాను 3:31-36
ధ్యానం:
"పొట్టేళ్ల కొవ్వు వేల్చుట కంటే అణుకువ లెస్స"(1 సమూ 15:23) అని సమూయేలు ప్రవక్త ప్రవచించాడు.అలనాడు తమ చుట్టూ నెలకొని ఉన్న దేశాలు,జాతులు తమను పాలించేందుకు శత్రువుల మీద దండయాత్రలు చేసి తమ ప్రజలను రక్షించేందుకు రాజుల వ్యవస్థను ఏర్పరచుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు మాత్రం 'యావే ప్రభువే' తమ రాజు, తమ సర్వస్వం అని తొలుత భావించిన అన్యులను చూచి తమకు కూడా రాజు కావాలని, తమను కూడా ఫలించాలని, కదన రంగానికి నడిపించాలని ఉవ్విళ్ళూరారు.పదేపదే సమూయేలు ప్రవక్త చెంత మొరపెట్టుకున్నారు.'యావే ప్రభువు తప్ప మనకు వేరొక రాజు లేడు" అని ప్రవక్త ఎంత మొత్తుకున్నా ప్రజలు ఆయన మాట వినలేదు.ఆయనను విసిగించడం ఆపలేదు,చివరికి విసిగి వేసారి యావే ఆజ్ఞానుసారం బెన్యామీను గోత్రీయుడు సౌలును రాజుగా అభిషేకించాడు.కొంత కాలం చక్కగానే గడిచిన అమాలేకీయులతో -యుద్ధం సమయంలో దైవాజ్ఞను మీరాడు,అప్పగించిన కార్యాన్ని సంపూర్తిగా నిర్వహించక విధేయత సుగుణాన్ని కాలరాచాడు.అందుకు ప్రతిఫలంగా సౌలు రాచరికాన్ని మాత్రమే కాదు అంతకన్నా మిన్నగా యావే దేవుని విశ్వాసాన్ని కూడా కోల్పోయాడు.సౌలు రాజు ప్రవర్తనకు భిన్నంగా జీవించారు అపొస్తలులు.యేసు పేరిట బోధింపరాదని ప్రధాన యాజకుడు,మతపెద్దలు ఆజ్ఞాపించినా,బెదిరించినా వెనకడుగు వేయలేదు. "మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులముగనే ఉంటాం. మీరు లోకమంతా తిరిగి సమస్త జనులకు సువార్తను బోధింపుడు..." (మార్కు 16:15) అని ఆయన మనకొసగిన చివరి ఆజ్ఞను నెరవేర్చుటకు ప్రాధాన్యతనిస్తాం.ఆయనకు సాక్ష్యమిచ్చె సమయంలో మాకు ఎదురయ్యే ఇబ్బందులను లెక్కచేయం అని ఖరాఖండిగా చెప్పారు.అలాగే దైవానికి విధేయులై జీవించి, ఆయన కార్యనిర్వహణలోనే ప్రాణాలు అర్పించారు.అదే సందేశాన్ని బాప్తిస్మ యోహాను కూడా అందించాడు.తనను తాను తగ్గించుకుంటూ ఆయనను హెచ్చించాడు. ఆయనకే సాక్ష్యమిచ్చాడు. యోహాను జీవన విధానం, ఎడారిలో ఘోషించిన పద్ధతి పలువురిని ఆయన చెంతకు చేర్చింది.ఆయన శిష్యులుగా మార్చింది.చివరికి ఆయనే రానున్న మెస్సయానేమో అని అనుకునేలా చేసింది.అయితే యోహాను మాత్రం తాను ఎడారిలో ఎలుగెత్తి ఘోషించే స్వరాన్ని మాత్రమే ఆయన పై నుండి వచ్చువాడు.ఆయన పాదరక్షల వారును విప్పుటకైనా నేను అయోగ్యుడనే అని తనను తాను తగ్గించుకొని దైవ ప్రణాళికను సంపూర్తిగా విధేయించాడు.బాప్తిస్మ యోహాను,అపోస్తలులు, శిష్యులవలె దైవం మనకు అప్పగించిన కార్యాలను నిర్వహిస్తూ సంపూర్తిగా విధేయులమై జీవిద్దాం
