యేసుక్రీస్తు పునరుత్థానుడైన తరువాత ఎంతమందికి కనుపించాడు?.

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
06 Apr 2026
యేసుక్రీస్తు పునరుత్థానం నాలుగు సువిశేషాల్లోనూ మరియు పౌలుని లేఖల్లోనూ కనిపిస్తుంది.క్రీస్తు ఉత్థానమైన ఉదయం ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు కనుపిస్తాయి. ఎందరో వ్యక్తులు ఆయన దర్శనంతో ఆశ్చర్యం, అద్భుతానందం చెందటం గమనిస్తాం.వివరణలన్నీ ఒకే క్రమంలో కనిపించవు.ఏది ఏమైనా పునరుత్థాన క్రీస్తు, ఒకరికో లేదా అంతకు మించిన సంఖ్యకో దర్శనమిచ్చారనడం నిర్వివాదాంశం. ఒక్కో రచయిత తాను వివరించిన తీరు ఇలా ఉంటుంది.
మత్తయి:
క్రీస్తు పుణ్యస్త్రీలకు కనిపించాడు -ఒక పర్వతం మీద తిరిగి గమపించాడు (28:1-17)
మార్కు: మరియ మగ్దలీన ఆయన్ను చూసింది - ఎమ్మావుస్ అనే గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులు ఆయన్ను చూశారు మోక్షరోహణమునకు ముందు పదకొండు మంది శిష్యులు ఆయన్ను చూశారు (16:9-14)
లూకా: ఎమ్మావుస్ మార్గంలో ఇద్దరు శిష్యులు ఆయన్ను చూశారు.. పేతురు, ఇతర శిష్యులు యెరూషలేములో సమావేశమై ఆయన్ను చూశారు. (24:1-49)
యోహాను: మరియ మగ్గలీనుకు ఆయన కనుపించాడు.ఒక వారం తరువాత మిగిలిన పదకొండుమందికి కనుపించారు - తిబేరియా సరస్సు తీరంలో ఏడుగురు శిష్యులకు కనుపించాడు - తోమాసును సందేహనివృత్తి చేసికొమ్మని ఆహ్వానించాడు (20:1-4:1-14).
పౌలు : పేతురుకు కనిపించాడు పదకొండుమందికి కనుపించాడు. : - ఐదువందల మందికి కనుపించాడు (1 కొరింతీ 15:4-8).
ఇంతమందికి కనుపించిన ఉత్థానక్రీస్తును, పొరబాటుగా ఇంకోవ్యక్తిగా గుర్తించడం లేదా భ్రమలో మాట్లాడడమోనన్న అనుమానాలు ఆధారం లేనివి. సాక్షమిచ్చిన వారిలో, అధికభాగం నిరక్షరాస్యులు, కల్లాకపటమెరుగని పేదప్రజలేనని గుర్తుంచుకోవాలి.వారి నిరాడంబరత, నిజాయితీ, ప్రభువు చూపిన జీవితం పట్ల ఆసక్తి,అంకితభావం వారిని తప్పుడు ప్రచారానికి పురికొల్పి ఉండదు.వారంతా ఏదో పనికట్టుకొని పునరుత్థానం గురించి ప్రచారం చేశారన్న అభిప్రాయం నిరాధారమయింది.పైగా అలాంటి ప్రచారం వల్ల వాళ్ళు సాధించేదేమీ లేదు.కాగా తమ ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముండి కూడా వారు, పునరుత్థానాన్ని ప్రకటించడానికి వెనుకంజ వేయలేదు.ఆ కాలంలో మోసపు ప్రచారానికి కఠినమైన శిక్షలుండేవి.మోసాలను సులభంగా గుర్తించే కాలాలవి. ఉత్థానానికి సాక్షులుగా వారు చూపిన తెగువ, ధైర్యం వారిలో ప్రగాఢంగా నాటుకుపోయిన నమ్మకం.పునరుత్థాన క్రీస్తు మీది విశ్వాసమేనని గుర్తించాలి.
