"మీరు దైవములనీ నేను చెప్పితిని”

జోసెఫ్ అవినాష్
26 Mar 2026
తప:కాల 5వ శుక్రవారం
యిర్మియా 20:10-13
కీర్తన 18:2-6
యోహాను 10:31-42
ధ్యానం:
నేటి సువిశేషంలో యేసు ప్రభువు లేఖనంలో(కీర్తన 8:26) వ్రాయబడిన సత్యమును వారికి గుర్తుచేస్తున్నారు.దేవుడు తను ప్రేమించిన వారిని తనను ప్రేమించిన వారిని ఆయన పరిగణించే విధానం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండరాదని పలికిన తండ్రి దేవుడు కీర్తన 82:6లో "మీరును దైవములే” అని “మీరెల్లరు మహోన్నతుని పుత్రులే అని నేను వచించితిని "అని పలికి ఉన్నారు.తన వాక్కుని కలిగి ఉన్న వారిని దేవుళ్ళు అని స్వయంగా దేవుడే చెబుతూ ఉన్నారు. పాపాత్ముడైన మానవునికి ఎంత ఘనతను ఆ పరమ తండ్రి ఆపాదిస్తూ ఉన్నారో ఈ వచనము మనకు నిదర్శనము. “మానవుడు కేవలము రొట్టి వలననే జీవింపడు.కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును" (మత్తయి 4:4) అని వ్రాయబడి ఉందని యేసు ఇచ్చిన ప్రత్యుత్తరం క్రీస్తును నమ్మినవారు ఎవరైతే దేవుని వాక్కును హృదయములో పటిష్టపరచుకొని,ప్రకటించి, దేవుని రాజ్య స్థాపనలో భాగస్తులు అవుతారో అటువంటి వ్యక్తులను దేవుళ్ళు అని తండ్రి దేవుడు సంబోధిస్తూ ఉన్నారు.తండ్రి ఒక్కగానొక్క కుమారుడైన యేసుప్రభువు భూమికి ఏతెంచి దేవుని రాజ్యమును స్థాపించి సిలువ మరణము వరకు తండ్రికి విధేయుడై విశ్వాసులందరకి మాదిరిగా జీవించారు. విశ్వాసులమైన మనము కూడావాక్కు అనే రెండంచుల ఖడ్గం చేతపట్టుకొని దేవుని న్యాయాన్నినీతిని ఎవరైతే ఈ లోకంలో జరిపిస్తారో వాటి కోసం పోరాడుతారో అట్టివారిని తండ్రి దేవుడు ''దేవుళ్ళు' అనగా' మహోన్నతుని పుత్రులు' అని పిలుస్తూ ఉన్నారు.
అటువంటివారు రోమా 8:17 లో చెప్పినట్లుగా క్రీస్తువలె మొదట బాధలు తరువాత మహిమ.మొదటి పఠనములోవలె దేవునిలో శ్రమలు అనుభవించినా కడకు దేవుని మహిమలో భాగస్తులమవగలము.దేవుని వాక్కును మనము కలిగి ఉండాలి. దానిలో మనం జీవించాలి.వాక్యం ప్రకటించుటలో మరణించుటకైనను సిద్ధపడి ఉండాలి. అట్టివారినే దేవుడు "మహోన్నతుని పుత్రులు" అని నిజవారసులని పిలుస్తూవున్నారు.
