పునీత జోజప్ప గారి చేతిలోని సూచికలు - భావం
.jpg)
మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
18 Mar 2026
పునీత జోజప్పగారి పేరిట శ్రీసభ రెండు పండుగలను సూచించింది.మార్చి 19న జోజప్ప గారి మహోత్సవమయితే,మే 1వ తేదీన శ్రామికుడైన జోజప్ప గారిని భక్తులు స్మరణ చేసుకుంటారు.ఆయన స్వరూపంలోని వస్తువులు వివిధ విషయాలను మనకు గుర్తు చేస్తాయి.
1. వడ్రంగి-:
జోజప్ప గారిని వడ్రంగిగా మత్తయి పరిచయం చేశాడు: "ఇతడు వడ్రంగి కుమారుడు కాడా...." అంటూ యూదులు యేసును గురించి మాట్లాడుకోవడం మత్తయి వివరిస్తాడు (మత్తయి 13:55), తమ పరికరాల ద్వారా చెక్కపనులు చేసేవారు చక్కని రూపాలలో వస్తువులను తయారుచేస్తారు.జోజప్ప గారి జీవన వృత్తిని సూచించడానికి ఆయన చేతిలో ఈ వడ్రంగి పరికరాలు ఈయన తిరుకుటుంబాన్ని పోషించిన తీరును వివరిస్తాయి..
2.లిల్లీపుష్పాలు-:
తెలుపు వర్ణంలో ఉండే లిల్లీ పుష్పాలు జోజప్ప గారి పవిత్రతను,నిరాడంబరతను, విధేయతను సూచిస్తాయి: "యోసేపు, ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను" (మత్తయి 1:24). నిర్మలత్వాన్ని సూచించే ఈ పుష్పాలు- మరియమ్మకు, జోజప్ప గారికి మధ్యవున్న పవిత్రబంధాన్ని గుర్తుచేస్తాయి. పవిత్రమైన విరక్త జీవితంతో మరియమ్మపట్ల అతడు చూపిన గౌరవానికి ఈ పుష్పాలు నిదర్శనం:"ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు"(మత్తయి 1:25).
3. పూలతో విరబూసిన కఱ్ఱ: ఇటువంటి వస్తువులు బైబిలులో కనుపించవు. అయితే బైబిలులో కనుపించని కొన్ని ముఖ్య విషయాలపై కూడా మొదటి శతాబ్ది క్రైస్తవులు ఆసక్తి చూపేవారు. ఈ గురుతు ద్వారా జోజప్పగారిని దేవుడు మరియ్యకు ఎన్నిక చేసిన భర్తగా గుర్తించేవారు.ఈ పోలిక బహుశా పాతనిబంధనలోని అహరోను కత్తి చిగురించడంతో పోలి ఉండవచ్చు.అలా ఆకులు వేసి,పూలు పూసిన అహరోను కఱ్ఱ అతనికి దేవుని ఎన్నికను సూచించింది (సంఖ్యా 17:1-13),పూలతో చిగురించిన కర్రను చేతిలో ధరించడం ద్వారా జోజప్పగారు దేవుని ఎన్నికను,పవిత్ర బాధ్యతను కలిగి ఉన్నాడని ఈ సూచిక గుర్తుచేస్తోంది.
4. బాలయేసు-:
జోజప్పగారి చేతిలో బాలుడైన యేసు కూర్చొని ఉన్నట్లు కొన్ని స్వరూపాలలో కనుపిస్తుంది. ఇది జోజప్పగారికి దేవుడు దయచేసిన పవిత్ర బాధ్యత (మత్తయి 2:19-23) బాలయేసుకు అతడు సాకుడు తండ్రిగా,రక్షణగా, పోషకుడుగా,నియమించబడినాడు.
5. దావీదు నక్షత్రము-: జోజప్పగారి దగ్గర దావీదు నక్షత్రం కనుపిస్తే ఇతడు దావీదు వంశస్థుడని,అబ్రహాము సంతతి వాడని గుర్తుంచుకోవాలి.జోజప్ప నీతిమంతుడే కాక విశ్వాసముగల యూదుడు (మత్తయి 1:19).దావీదు కుమారుడుగా ప్రస్తుతినందుకొన్నాడు (మత్తయి 1:20) యూదా మతాచారాలను,మోషే ధర్మశాస్త్రాన్ని విశ్వాసపాత్రంగా ఆచరించిన నమ్మకపాత్రుడైన యూదుడు (లూకా 2:24)
6. జతగువ్వలు:
జోజప్ప మరియమ్మలు బాలయేసును యెరూషలేము దేవాలయానికి తీసుకుపోయారు (లూకా 2:22-24) యూదయా సాంప్రదాయం ప్రకారం ఒక జత గువ్వలను బలి సమర్పణగా అర్పించారు.ఇవి పేదవారి బలిఅర్పణ కానుకలు (లేవి 14:22) ఈ జత గువ్వలు జోజప్ప గారి పేదరికాన్ని, సామాన్యజీవితాన్ని సూచిస్తాయి కూడా.
