కాడి దేనికి చిహ్నంగా ఉంది?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
10 Mar 2026
ప్రశ్న:-
భారముచే అలసిసొలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను" అని చెప్పిన తరువాత "నా కాడిని మీరెత్తుకొనుడు" అని అంటారు యేసుప్రభువు.కాడి దేనికి చిహ్నంగా ఉంది (మత్తయి 11:29)?
సమాధానము:
బైబిలు గ్రంధంలో ఇది ఎంతో ఊరటను కలిగించే వాక్యం.ఈ వాక్యాన్ని మరియు “కాడి" అన్న పదాన్ని యేసుక్రీస్తు జీవించిన పరిస్థితులను బట్టి అవగాహన చేసికోవాలి.కాడి అన్నది యూద మతనాయకులు,రబ్బీలు, ప్రజలమీద మోపబడిన మోషే చట్టానికి చిహ్నంగా వాడేవారు.వీరికే మోషే చట్టాన్ని (TORAH OF THE LAW OF MOSES) వివరించి, ప్రజల చేత ఆచరింపజేసే బాధ్యత కూడా అప్పగించబడింది. దానిని వారు శాఖోపశాఖలుగా విస్తరించి,ప్రజల మీద మోపి, మోయలేని భారంగా తయారు చేశారు.వీటికి అదనంగా యూదా సంఘంలో చేయవలసినవి,చేయకూడనివి కలిపి,అటు అర్చన క్రమంలోను,ఇటు సాంఘీక జీవనంలోను లెక్కకు మించిన చట్టాలు,శాసనాలు పుట్టకొచ్చాయి. ఈ 'కాడి' క్రింద ప్రజలు నలిగిపోయేవారు.ఈ నేపధ్యంలో యేసు వారిని విముక్తి చేయదలిచాడు.ప్రజల మీద గుత్తాధిపత్యానికై యూదయా మతనాయకులు రూపొందించిన ఈ అమానవీయ (అనవసర) చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాడు.మౌళికమైన ప్రేమ చట్టాన్ని బోధించాడు.అందుకే ఆయన "నా కాడిని మీరెత్తుకొనుడు.నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది" అని చెప్పగలిగాడు (మత్తయి 11:29-30).అంటే యూదుల కఠినమైన చట్టాలను,శాసనాలను తిరస్కరిస్తూ,ప్రేమచట్టం ద్వారా మానవత్వానికి నూతన అర్ధాన్ని ఇవ్వగలిగాడు.
