నేటి పునీతురాలు :పునీత ఫ్రాన్సెస్ ఆఫ్ రోమ్

ఫాదర్ ఆకుల ప్రసాద్
08 Mar 2026
సుగుణం: "పరిశుద్ధ ఆదర్శగృహిణి”
పునీత ఫ్రాన్సెస్ గారు క్రీ.శ. 1384లో ఇటలీ లోని రోమ్ నందు జన్మించారు.ఈమె 6సం!రాల ప్రాయంలోనే గొప్ప భక్తిగల బాలికగా పేర్గాంచారు.తాను మఠాశ్రమంలో చేరి ధ్యానంతో దైవసేవ చేయాలన్న ఆమె తలంపు దైవచిత్తం కాదని భావించి రోమానగర నివాసియైన లోరెంజో గారిని క్రీ.శ 1396లో వివాహం చేసుకొని 40సం!రాలు చక్కగా దాంపత్యజీవితాన్ని సాగించారు.ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చి వారిని చక్కటి కతోలిక విశ్వాసంలో పెంచడమే గాక అటు దైవసేవకు ఇటు కుటుంబ బాధ్యతలకు తాను పూర్తిగా న్యాయంచేశారు.క్రీ.శ.1408లో నేపూల్సు నుండి శత్రుసైన్యం రోము నగరాన్ని ధ్వంసం చేసి ఫ్రాన్సెస్ గారి భవనాన్ని కూలగొట్టి వారి సంపదను,భూములను దోచుకోవడమే గాక ఆమె భర్తను బందీగా తీసుకెళ్లారు.దేవునిపై భారం వేసిన ఫ్రాన్సెస్ గారు ధైర్యం కోల్పోక భర్త విముక్తికొరకు విశ్వప్రయత్నం చేశారు.ఆ ప్రయత్నంలో తన ఇద్దరుకుమారులను కూడా కోల్పోయారు.అయిననూ ఆమె దేవుని విడనాడక,ఏసుశ్రమలను స్ఫూర్తిగా చేసుకొని నిరంతరం ప్రార్థించేవారు.చివరకు ఆమె ప్రయత్నం ఫలించి లోరెంజో గారు విడుదలైయ్యారు.కష్టాలలో ఫ్రాన్సెస్ గారి పరిశుద్ధ జీవితాన్ని గమనించిన రోములోని ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు ఆమె ఆదర్శమార్గంలో జీవించుటకు సిద్దపడి ఫ్రాన్సెస్ గారి నాయకత్వాన వారంతా బెనడిక్టుసభగా రూపొంది ప్రార్థన,వ్యాధిగ్రస్తుల సందర్శన, పేదలకు సేవ వంటి సాధారణ సభ నియమ బాధ్యతలను గొప్పగా పాటించడం ప్రారంభించారు.దేవుడు ఫ్రాన్సెస్ గారికి స్వస్థతావరాన్ని,ప్రవచనావరాన్ని మరియు తన కావలిదూతను కళ్ళారా చూచే వరాలను అనుగ్రహించారు.ఆమె వాటిని దేవుని మహిమ కొరకే వెచ్చించారు.వీరు క్రీ.శ.1440 మార్చి 9న పరలోకప్రాప్తినొందగా క్రీ.శ.1608లో 5వ పాల్ పోపుగారు ఫ్రాన్సెస్ గారిని పునీతులుగా ప్రకటించారు.
పునీత ఫ్రాన్సెస్ గారా మాకొరకు ప్రార్ధించండి!
