“మేము సిద్ధమే"
జోసెఫ్ అవినాష్
02 Mar 2026
తప:కాల 2వ మంగళవారం
యెషయా1:10,6-20
కీర్తన 50:8,9,16-17,21,23
మత్తయి 23:1-12
ధ్యానం:
అమ్మ ప్రేమ ఎంతో తియ్యనిది. అటువంటి అమ్మ ప్రేమ తన బిడ్డలకు ఎల్లప్పుడూ మంచిని కోరుకొంటూ తన బిడ్డలు వారి కంటే అత్యున్నత ప్రమాణాలను అంతస్తును కలిగి ఉండాలని ఉవ్విళ్ళూరుతుంటారు.అటువంటి తల్లి ప్రేమ కపటము లేనిది, కడవరకు నిలచునది.నేటి సువిశేషమునందు జెబదాయి కుమారులగు యోహాను,యాకోబుల తల్లి యేసు వద్దకు వచ్చి,సాగిలపడి నమస్కరించి, "నా కుమారులు దైవ రాజ్యములో మీ కుడి,ఎడమ వైపున కూర్చుండునట్లు, ఆజ్ఞాపింపుము."అని ప్రాధేయపడినది.అందుకు బదులుగా యేసు తన శ్రమలయందు పాలు పంచుకొనుటకు రక్తపాతమునుండి త్రాగుటకు సిద్ధంగా ఉందురా” అని అడుగగా ఆ ఇద్దరు సహోదరులు “మేము సిద్ధమే" అని సమాధాన మిచ్చిరి. అయిననూ యేసు వారి తల్లి కోరికను మరింత ప్రశిస్తూ తన రక్తపాత్రమును సేవించుటకు వారు సిద్ధముగా ఉన్ననూ,తన కుడి, ఎడమ వైపున కూర్చుండుట మాత్రము కేవలము దైవ చిత్తమని తెలియచేసి,తండ్రి దేవునితో తనకుగల ప్రేమ బంధమును రూఢిచేసాడు.
మన అనుదిన జీవితములో పలు కలలను సాకారం చేసుకొనే ప్రక్రియలో తరచూ “దైవ చిత్తమును నెరవేరుస్తున్నానా?” అనెడి మీమాంస ఎదురవుతుంది. కేవలము అభివృద్ధి,ప్రగతి మార్గములను అన్వేషిస్తూ ఉంటే, బహుశా దేవుని నిర్ణయములను, చిత్తమును నెరవేర్చు మార్గములను,అవకాశములను విస్మరించు ప్రమాదములో పడవచ్చు అనుదిన ప్రార్ధన ద్వారా,దైవవాక్కు పఠనము, ధ్యానము ద్వారా దేవుడు మన కొరకు ఏర్పరచిన మార్గమును తెలుసుకొనినచో మన ఆలోచనలను,ప్రణాళికలను దేవుడు అమితముగా ఆశీర్వదించును.మనము చేయు కార్యములు,ప్రణాళికలు కారణభూతమయిననూ తపస్సుకాల ప్రయాణములో వాటిని దేవుని పాదముల చెంత ఉంచి,త్యజింపు మార్గమును ఎంపిక చేసినచో మన జీవితము ఫలభరితమవ్వును.
