మనం పవిత్రులుగా బ్రతకటానికి పిలవబడ్డాం

జోసెఫ్ అవినాష్
22 Feb 2026
తపో:కాల 1వ సోమవారం
లేవి 19:1-2,11-18
కీర్తన 19:8-10,15
మత్తయి 25:31-48
ధ్యానం:
"మీ దేవుడను ప్రభుడనైనా నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండదు" ఇక్కడ పవిత్రత అంటే కేవలం పూజకు వెళ్ళడం,ఆరాధనలో పాల్గొనడం,పాపసంకీర్తనాన్ని చేయడం మాత్రమే కాదు. సర్వమానవాళిని తన సహోదరీ, సహోదరులుగా చూడడం,పొరుగువారి మీద ద్వేషం పెంచుకోకుండా, పగతీర్చుకోకుండా నీవలె నీ పొరుగు వానిని ప్రేమించడం ఆచరిస్తే దేవుని పవిత్రత నీలో ఉన్నట్టు.కడరా తీర్పు సమయంలో ప్రభువు నీవెన్ని సార్లు ఆరాధనలో పాల్గొన్నావు అని అడగరు.ఆకలిగొన్న వారి ఆకలి తీర్చావా? కనీసం ప్రేమతో కొన్ని మంచినీళ్ళైనా ఇచ్చావా?ఎముకలు కొరికే చలిలో రోడ్డు ప్రక్కన బాధపడుతున్న వారికి ఆశ్రయమిచ్చావా? అని అడుగుతారు.మనలో అటువంటి ఆశ ఉన్న సమయం సందర్భం కలిసిరాక కొన్ని సార్లు అశ్రద్ధ చేసి ఉండొచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా దాటవేసి ఉండొచ్చు.తెలిసి తెలిసి కొన్ని సార్లు తప్పిదాలు చేస్తుంటాం.. -మానవ తప్పిదాలు ఎన్నో రకాలుగా ఉంటాయి.మనకు తెలుసు మనం తప్పులు చేస్తున్నామని వాటన్నిటిని జయించడానికి ఈ తపస్కాలం మనకు ఉపయోగపడాలి. నీలోని అలసత్వాన్ని తొలిగించుకోడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావించాలి. ఆసుపత్రులను సందర్శించు. వ్యాధిగ్రస్తులను ఓదార్చు.నీ పొరుగువాని గురించి ఒకసారి విను.ఏ విధంగానైనా ఆదుకోగలవేమో ప్రయత్నించు. బీదసాదల గురించి ఆలోచించు.కనీసం కుటుంబాలలో చదువుకుంటున్న పిల్లలకు ఏ విధంగానైనా సహాయ పడగలవేమో చూడు.క్రమం తప్పకుండ పాపసంకీర్తనాన్ని చేయడం మరచిపోకు.అది నీ జీవన విధానాన్ని నీకు పదే పదే గుర్తు చేయడానికి లోపాలను సరిదిద్దుకోడానికి సహాయపడుతుంది.నీ జీవితాన్ని దేవుని పవిత్రతతో నింపడానికి ఇదే అనుకూల సమయం.
