శ్రీసభకు పాపుగారు అవసరమా?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
15 Feb 2026
మానవ చరిత్రలో ప్రజలకు దేవుడు ఎప్పుడూ ఒక నాయకున్ని ఇస్తూ వచ్చాడు.ఇశ్రాయేలు ప్రజలకు అబ్రహాములాంటి పితృపాదులను మోషేలాంటి నాయకులను, యెషయాలాంటి ప్రవక్తలను,దావీదులాంటి రాజులను, యెహోషువాలాంటి అగ్రగణ్యులను ప్రసాదించాడు.యేసుక్రీస్తులో ఈ నాయకులందరూ సమ్మిళితమై ఉన్నారు.అదే నాయకత్వంతో పాలస్తీనాలో తనకప్పగించబడిన ప్రజలను నడిపించాడు యేసుక్రీస్తు.తన తరువాత శ్రీసభను నడిపించడానికి సేవాభావంతో కూడిన ఒక పదవిని ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించాడు.దానికి పేతురును ఎన్నుకొన్నాడు.ఈ పేతురు ప్రభువు ఏర్పాటు చేసిన పదవిలో కొనసాగుతూ,ఆయన వ్యవస్థీకరించిన సభను,ఆయన సహాయంతో నడిపిస్తాడు.శ్రీసభను ఒక మంచి కాపరిలా సంరక్షిస్తూ,నడిపించమని ప్రభువే ఆయనను ఏర్పరచుకొన్నాడు (చూడండి: మత్తయి16:18-19 మరియు యోహాను 21:15-17). పేతురు తరువాత ఆ పదవిలో ఎన్నుకొనబడినవారు,ఆ పదవిని కొనసాగిస్తూ పేతురు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.ఇది కతోలిక చరిత్రలో పారంపర్యంగా వస్తున్న ఆనవాయితీ.
