నేటి పునీతుడు: పునీత బెనెడిక్ట్ అనియానే

ఫాదర్ ఆకుల ప్రసాద్
11 Feb 2026
సుగుణం:"ఆధ్యాత్మిక మర అభ్యున్నతుడు"
రెండవ బెనెడిక్ట్ గా పేరొందిన బెనెడిక్ట్ అనియానే గారు ఫ్రాన్స్ నందు ఉన్నత కుటుంబంలో క్రీ.శ.747లో జన్మించారు.చార్లెమాగ్నే రాజు యొక్క ఆస్థానంలో పనిచేశాడు. ఒక సైనికచర్యలో భాగంగా తన సోదరుని రక్షించబోయి తాను పవిలియా దగ్గరలోని టిసినో నదిలో మునిగిపోయాడు. దేవుని కృపవల్ల రక్షింపబడి మారుమనస్సుచెంది ఈ లోక ఆశలను త్యజించి మఠసన్యాస జీవితం ఎంచుకున్నారు. సియేన్ నందలి పునీత సిక్వనుస్ సన్యాసమఠజీవితం లోకి ప్రవేశించాడు. మఠాలయంలో సామాన్య సన్యాసిగా జీవితాన్ని ప్రారంభించి మఠాధిపతిగా ఎన్నికైయ్యారు. కానీ తన కఠినతరమైన పద్ధతులు, క్రమశిక్షణ మిగిలిన సన్యాసులకు నచ్చకపోవుటచే మఠాన్ని వదలి లాంగ్వడక్ లోని అనియానే నందు క్రీ.శ.780లో ఒక మఠాలయాన్ని స్థాపించాడు. ఈ మఠం తాను అనుకున్నవిధంగా లేకపోవుటచే 782లో బెనెడిక్ట్ పద్దతులతోకూడిన మరో ఆశ్రమాన్ని స్థాపించాడు. అటుతరువాత లాంగ్వడక్ అంతటా అనేక ఆశ్రమాలు స్థాపించి సువార్తను వ్యాప్తిచేశాడు. అక్విటైన్ రాజైన 'లూయిస్ ద పయస్' కోరికతో ఆయన రాజ్యంలోని మఠాలయాలను బెనెడిక్ట్ గారు తన మఠపద్దతులతో పునరుద్దరించారు. క్రీ.శ. 817లో మఠసన్యాసుల సంఘ అధిపతిగా 'ఆచెన్' నందు "కోడెక్స్ రెగులారూమ్” అనే మఠనియమావళి తయారుచేశాడు. మఠాలయాల ఆధ్యాత్మిక పురోగతికి బెనెడిక్ట్ అనియానే గారి సేవలు అసమాన్యం. క్రీ.శ. 821 ఫిబ్రవరి 1న కొర్నెలిమున్స్టర్ మఠంనందు బెనెడిక్ట్ అనియానే గారు పరలోకప్రాప్తినొందారు.
పునీత బెనెడిక్ట్ అనియానే గారా మాకొరకు ప్రార్థించండి!
