నేటి పునీతుడు: పునీత గొన్సాలో గార్సియా
.jpg)
ఫాదర్ ఆకుల ప్రసాద్
06 Feb 2026
సుగుణం: “ధృడ వేద ప్రచార ఉపదేశి"
భారత ప్రధమ పునీతుడైన గొన్సాలో గార్సియా గారు ముంబైకి దగ్గరలో గల బస్సీన్ అనే వాసాయి గ్రామంలో క్రీ.శ.1557 ఫిబ్రవరి 5న జన్మించారు.దైవభక్తి,క్రమశిక్షణ కలిగిన వీరు పునీత ఫ్రాన్సిస్ శౌరివారి ప్రేరణ,ప్రోత్సాహంతో మరియు తన స్వీయనిర్ణయంతో 1572న ఏసుసభ గురువైన ఫాదర్ సెబాస్టియన్ గొన్ జాల్వెసు గారితో కలసి ఉపదేశిగా జపానుదేశానికి వెళ్ళి అక్కడి ప్రజలలో మమేకమై వారి వేషభాషలు,ఆచారాలు ఒంటబట్టించుకున్నారు.నాగసాకి ప్రాంతంలో ఉపదేశిగా సువార్తసేవచేశారు.జేసుసభలో సాధారణ బ్రదరుగానుండగోరినను అందుకనుమతిలభింపనందున ఫిలిప్పైన్ దీవులకు వెళ్ళి మనిలా నందు ఫాదర్ పీటర్ బాప్టిస్టుగారి అనుమతితో ఫ్రాన్సిస్కన్ సభనందు క్రీ.శ. 1587 జూన్ 7న బ్రదర్ గా మాటపట్టును స్వీకరించారు.1592లో ఫాదర్ పెద్రోబాప్టిస్టు గారికి సహాయకుడుగా తిరిగి జపాన్ వెళ్ళి టోక్యో నందు 500 మందికి పైగా జ్ఞానస్నానాలిప్పించి క్రీస్తులోనికి నడిపించారు. నగోయ, మియాకో, ఒసాకా ల్లోని ఫ్రాన్సీసు వారి మఠాలు, దేవాలయాలు, కుష్టువ్యాధివైద్యశాలల స్థాపనలో తన సేవలందించారు. 1596లో ఆ ప్రాంత గవర్నర్ యైన హిదేయోషి క్రైస్తవులను అనేక హింసలకు గురిచేశారు.అతని సలహాదారుడైన యంకుయిన్ అనునతడు ఫ్రాన్సిస్ బోధకులందరిని మట్టుబెట్టాలని తలంచి వారందరికి మనణదండన విధిస్తూ నల్లశాసనము జారీచేశాడు. దాని ఫలితంగా గోన్సాలో గార్సియా గారితో కలిసి మొత్తం 26 మందిని నాగసాకి నగరవీధుల్లో అతిక్రూరంగా హింసించి 1597 ఫిబ్రవరి 5న ఏసుప్రభువు వలె శిలువవేసి చంపారు. హతసాక్షులైన వీరందరినీ 1862 జూన్ 8న 9వ భక్తినాధ పోపుగారు పునీతులుగా ప్రకటించారు.
పునీత గొన్సాలో గార్సియా గారా మాకొరకు ప్రార్ధించండి!
