నేటి పునీతుడు: పునీత జాన్ బ్రిట్టో

ఫాదర్ ఆకుల ప్రసాద్
03 Feb 2026
సుగుణం: "భారతదేశ అపోస్తులుడు, ధృడవేదప్రచారకుడు”
భారతదేశ అపోస్తులుడుగా పేరొందిన బ్రిట్టో గారు పోర్చుగల్ లోని లిస్బను నందు 647 మార్చి 1న జన్మించారు.1662లో జేసుసభలో చేరి, 1673లో గురువుగా అభిషేకం పొందారు.
భారతావనిలో క్రీస్తును ప్రకటించాలనే తన కోరిక మేర, పెద్దల అనుమతితో 1673 సెప్టెంబర్ 4న గోవాలో అడుగుపెట్టారు. మలబార్ ప్రాంతంలోని అంబాలాకాడ్ విచారణలో తమిళం నేర్చుకొని "అరుళానందర్" గా పేరుమార్చుకొని సెంజీ ప్రాంతంలోని 'కోలాయి' విచారణకు 1674 జూలై 30న చేరుకొని కాలినడకన,ఎద్దుల బండిమీద గ్రామాలలో సత్యోపదేశాన్ని బోధిస్తూ,ప్రజలకు క్రైస్తవ జీవన విధానాన్నినేర్పుతూ 11సం!రాలు విశేష కృషిచేశారు. అనేకమంది క్రైస్తవ విశ్వాసంలోకి రావడంతో హైందవ పూజారులనుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. బ్రిట్టోగారు సువార్తసేవను తంజావూరులోని 'తాటువన్సేరి' మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలకు విస్తరించి కొన్ని దేవాలయాలను కూడా నిర్మించారు.అక్కడి రైతులు తెగుళ్ళచే పంటలు నష్టపోతుండగా బ్రిట్టో గారిచే ఆశీర్వదించబడిన విబూధిని పొలాల్లో చల్లి అధిక దిగుబడిని పొందుటచే క్రీస్తును నమ్మి విశ్వసించారు.బ్రిట్టో గారు మధురై,తిరుచ్చి,తంజావూరు,పుదుకొట్టాయి,దక్షిణ,ఉత్తర ఆర్కాటు ప్రాంతాల్లో క్రీస్తును ప్రకటించారు.'మరువనాడు', 'మార్వా' ప్రాంతాలకు సువార్తను ప్రకటించుటకు వెళ్ళగా అక్కడి రాజైన సేతుపతి దగ్గరవుండే 'కుమారప్పపిళ్ళయి" అనే మంత్రి బ్రిట్టోగారిని ఆయన శిష్యుడైన సిలువైనాయకర్ ను బందించి అనేక హింసలకు గురిచేశారు.జైలునుండి విడుదలైన బ్రిట్టోగారు 1687లో లిస్బన్ వెళ్ళి తిరిగి 1690న గోవా చేరుకొని, 1692న మళ్ళీ 'మరువనాడు'లో అడుగుపెట్టి అనేక మందిని క్రీస్తులోనికి నడిపించారు. సేతుపతిరాజు 1693 ఫిబ్రవరి 4న బ్రిట్టిగారిని పెరుమాళ్ అనే తలారిచే శిరశ్చేదనం గావించారు.1948 జూన్ 22న 12వ భక్తినాధపోపుగారు బ్రిట్టో గారిని పునీతులుగా ప్రకటించారు.
పునీత జాన్ బ్రిట్టో గారా మాకొరకు ప్రార్ధించండి!
బంగారు మాట:
దైవపిలుపుకు నీయిష్టం
వచ్చినట్లు బదులివ్వకూడదు.
దేవుని తీర్పునకు లోబడునట్లు
సమాధానమివ్వాలి.
(పునీత జాన్ బ్రిట్టో)
