బాలయేసు దేవాలయములో కానుకగా సమర్పించు మహోత్సవము

Father gopu praveen
01 Feb 2026
"సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు: ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అపుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగ దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శ్రీఘ్రముగా వచ్చును" (మలాకి 3:1)
ఈ పండుగ నాలుగు విషయాలను ప్రత్యేకముగా ధ్యానిస్తుంది: 1. మౌనము వహించినను తిరు కుటుంబాన్ని కాపాడిన, ప్రేమగల, నీతిమంతుడైన యోసేపు; 2. సిమియోను విశ్వాసము; 3. ప్రార్ధనాపూర్వకమైన విశ్వాసముగల అన్నమ్మ; 4. అన్నింటికన్న ముఖ్యముగా దేవుని చిత్తానికి ఎల్లప్పుడు అందుబాటులోనున్న మరియ తల్లి.
లూకా సువార్త ప్రకారం, బాలయేసును దేవాలయములో కానుకగా అర్పించుట, మరియమ్మ మోషే చట్టప్రకారము శుద్ధిగావించబడటం ఒకేరోజు జరిగాయి. బాలయేసు జన్మించి ఎనిమిది దినములు గడచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి, 'యేసు' అని పేరు పెట్టిరి (లూకా 2:21). అలాగే, బాలయేసు జన్మించిన 40వ రోజున, అతనిని దేవాలయములో కానుకగా సమర్పించారు (నిర్గమ 13). ఎందుకు దేవాలయములో యేసును కానుకగా సమర్పించారు? మోషే చట్టము లేదా యూదుల ధర్మశాస్త్రం ప్రకారం, స్త్రీ బిడ్డను ప్రసవించిన తరువాత, 40 రోజులు, ఆశుద్దురాలుగా పరిగణింప బడుతుంది. 40వ రోజున, శుద్ధికాలము ముగియగానే, దేవాలయములో శుద్ధీకరణకు కానుకలు సమర్పించ వలసియున్నది. యాజకుడు ఆమె శుద్ధిని పొందు విధిని నిర్వహింపగా ఆమె శుద్ధిని బడయును (చదువుము. లేవీ 12:1-8). అలాగే, మోషే చట్టము లేదా యూదుల ధర్మశాస్త్రం ప్రకారం, ప్రతీ ప్రతీ తొలి మగ శిశువును దేవునికి సమర్పించాలి (నిర్గమ 13:2, 12). ఇది దేవునికి కృతజ్ఞత తెలియజేసే ఆచారం.
పండుగ పుట్టు పూర్వోత్తరాలు: 1969 వరకు ఈ పండుగ 'మరియమాత శుద్ధీకరణ పండుగ' అని పిలువబడినది. బహుశా నాలుగవ శతాబ్దమునుండి, యెరూషలేము దేవాలయములో 'మరియమాత శుద్ధీకరణ పండుగ' కొనియాడబడింది. అక్కడనుండి క్రైస్తవ లోకమంతా కూడా ఈ పండుగ వ్యాప్తి చెందినది. కాన్-స్టాంట్-నోపుల్ రాజ్యములో కలరా వ్యాధి ప్రభువు దయవలన కనుమరుగై పోవుటవలన, కృతజ్ఞతగా, ఈ పండుగను 1వ జుస్తీనియన్ జగద్గురువులు క్రీ.శ. 526లో ఈ పండుగను జరుపుకొనుటకు అధికారపూర్వకముగా అనుమతిని ఇవ్వడం జరిగింది.
ఇదే రోజును 'క్రొవ్వొత్తుల దినోత్సవము'గా కూడా పిలుస్తారు. ఎందుకన, ఈ రోజు అనేక చోట్ల వెలుగుచున్న క్రొవ్వొత్తులతో గుడిలోనికి ప్రదక్షిణగా వచ్చి, బాలయేసు స్వరూపమునకు సమర్పిస్తారు. అలా చేయడానికి కారణం, సువిషేశములో విన్నట్లుగా సిమియోను బాలయేసును “అన్యులకు ఎరుకపరచు వెలుగు. నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు” (లూకా 2:32) అన్న దానికి సూచనగా చేయడం జరుగుతుంది. ఈ ఆచారం 6వ శతాబ్దములో ఫ్రాన్సు దేశములో ప్రారంభమై, మధ్యయుగ కాలములో బాగా ప్రాచుర్యములోనికి వచ్చినది. 8వ శతాబ్దములో గురువులు, విశ్వాసులు ఆశీర్వదింప బడిన క్రొవ్వొత్తులతో గుడిలోనికి ప్రదక్షిణగా రావటాన్ని సెర్జియుస్ జగద్గురువులు ప్రారంభించారు. క్రీస్తు ఈ లోకమునకు వెలుగుగా వచ్చెను అని మనం ఈవిధముగా అర్ధవంతముగా విశ్వాసముతో ప్రకటిస్తున్నాము.. "లోకమునకు వెలుగును నేనే" (యోహాను 8:12) అని యేసు కూడా స్వయముగా ప్రకటించారు.
దేవాలయములో సమర్పణ: బాలయేసు జన్మించి 40వ రోజున దేవాలయములో కానుకగా అర్పించుటకు మరియ జోజప్పలు యెరూషలేమునకు వెళ్ళారు. ఎందుకన, "ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి సమర్పింపబడ వలయును.” తొలిచూలు మగబిడ్డను దేవునికి సమర్పింపబడటం ఒక పురాతన ఆచారం. దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆచారం ప్రకారం, ప్రతి కుటుంబంలోని తొలిచూలు మగబిడ్డను దేవునికి సమర్పించాలి. నిర్గమ 13:2లో “ప్రభువు మోషేతో, యిస్రాయేలీయులలో పుట్టిన తొలి బిడ్డల నెల్ల నాకు అంకితము చేయుము” అని చదువుచున్నాము. అలాగే, 13:12లో “మీ స్త్రీలకు పుట్టిన తొలి మగ బిడ్డలను దేవునికి అంకితము చేయ వలయును” అని చూస్తున్నాము. దీనిప్రకారం, ఇశ్రాయేలీయులు తమ తొలిచూలు మగబిడ్డలను దేవునికి సమర్పించేవారు. ఈ ఆచారం సాధారణంగా బిడ్డ పుట్టిన కొంతకాలం తర్వాత జరుగుతుంది. తల్లిదండ్రులు తమ బిడ్డను దేవాలయానికి లేదా ప్రార్థనా మందిరానికి తీసుకొని వెళ్లి, అక్కడ దేవునికి సమర్పిస్తారు. ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆశీర్వాదాలు ఉంటాయి.
ఈ ఆచారానికి అనేక అర్థాలు ఉన్నాయి: దేవునికి కృతజ్ఞత: తమకు బిడ్డను ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలపడం. దేవునిపై ఆధారపడటం: తమ బిడ్డ యొక్క సంరక్షణ మరియు భవిష్యత్తు కోసం దేవునిపై ఆధారపడటం. విశ్వాసం: దేవుని పట్ల తమ విశ్వాసాన్ని వ్యక్తీకరించడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం. కుటుంబ బంధం: కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలపరచడం మరియు బిడ్డను దేవునికి అంకితం చేయడం.
నేటి పరిస్థితి: నేడు చాలా మంది క్రైస్తవులు ఈ ఆచారాన్ని పాటిస్తారు. అయితే, దీనికి సంబంధించిన ఆచరణలు, నమ్మకాలు వేర్వేరు సంప్రదాయాలలో భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో తొలిచూలు మగబిడ్డను దేవునికి సమర్పించే సంప్రదాయం అనేక ప్రాంతాలలో, అనేక రూపాలలో కనిపిస్తుంది. హిందూ సంప్రదాయంలో, ఈ ఆచారాన్ని ‘జాతకర్మ’ అని పిలుస్తారు. ఇది బిడ్డ పుట్టిన తర్వాత చేసే 16 సంస్కారాలలో ఒకటి. ఈ సమయంలో, తల్లిదండ్రులు తమ బిడ్డను దేవునికి సమర్పించి, దీర్ఘాయువు, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ఇస్లాం సంప్రదాయంలో, బిడ్డ పుట్టిన తర్వాత "అకీకా"[వెంట్రుకలను సమర్పించడం, నామకరణం కూడా చేస్తారు] అనే ఆచారం చేస్తారు. ఇది దేవునికి కృతజ్ఞతలు తెలపడానికి మరియు బిడ్డకు ఆశీర్వాదాలు కోరడానికి చేస్తారు. క్రైస్తవ సంప్రదాయంలో, ఈ ఆచారాన్ని "బాలయేసు సమర్పణ" అని పిలుస్తారు. ఇది యేసుక్రీస్తును దేవాలయంలో సమర్పించిన సంఘటనను గుర్తు చేస్తుంది. ఈ రోజున, తల్లిదండ్రులు తమ బిడ్డను చర్చికి తీసుకువెళ్లి దేవునికి సమర్పిస్తారు.
మరియ జోజప్ప: “వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి, గలిలీయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను” (2:39-40). తిరు కుటుంబము, మోషే చట్టమునకు విధేయులై జీవించారు. పవిత్ర కుటుంబముగా జీవించారు.
మరియ జోజప్పలు మోషే చట్టము ప్రకారము ‘ఒక జత గువ్వలనైను, రెండు పావురముల పిల్లల నైనను’ బలి సమర్పణ చేయుటకు దేవాలయమునకు వెళ్ళారు. అచట, బాలయేసును యాజకుని చేతులో పెట్టడము వలన, బాలుని దేవునికి కానుకగా సమర్పించిరి. మోషే చట్టప్రకారము, బిడ్డను ఐదు వెండి నాణెములు చెల్లించి విడిపించుకొన వలెను (సంఖ్యా 3:47-48; 18:15-16).
సిమియోను, అన్నమ్మ: 'వెలుగు' చీకటిని, అంధకారమును జయించాలంటే, ఎన్నో శ్రమలను అనుభవించ వలసి యున్నదని సిమియోను పవిత్రాత్మద్వారా ప్రేరేపింపబడి ఈ బాలయేసే క్రీస్తు, మెస్సయ్యయని, అన్యజనులకు రక్షకుడు అని గుర్తించాడు, ప్రవచించాడు. సిమియోను బాలయేసు తల్లియైన మరియమ్మతో ఇలా పలికాడు, “ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి యున్నాడు. అనేకుల మనోగత భావములను బయలు పరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది” (2:34-35). ఈవిధముగా, బాలయేసు పరిపూర్ణము చేయవలసిన రక్షణ కార్యమును తెలియ జేశాడు. వాస్తవానికి యేసు “పాపులను పిలువ వచ్చినాడు; నీతిమంతులను పిలుచుటకు రాలేదు” అని తానే స్వయముగా ప్రకటించాడు(లూకా 5:32). ఆయన “తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు” (లూకా 19:10) అని తెలియ జేశాడు. అలాగే, రక్షణ కార్యములో మరియతల్లికూడా, తన విశ్వాసమునకు విధేయతగా ఉంటూ, కుమారునితో శ్రమలను అనుభవించ వలసి యున్నదని తెలియజేయ బడినది. మరియ పరిపూర్ణ శిష్యురాలు; విశ్వాసానికి, ప్రేమకు ఆదర్శమూర్తి. దేవుని వాక్యాన్ని పరిపూర్ణముగా విశ్వసించినది.
సిమియోను నీతిమంతుడు, దైవభక్తుడు. పవిత్రాత్మ అతని యందుండెను (2:25). అన్నమ్మ ప్రవక్తి. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి యుండెను (2:37). వీరిరువురు యిస్రాయేలు ప్రజలవలె మెస్సయ్య కొరకు వేచియున్నారు. బాలయేసును దేవాలయములోనికి కొనివచ్చినపుడు, వారచటకు ఆత్మ ప్రేరణచేత నడిపింపబడ్డారు. సిమియోను బాలుని చూడగానే, క్రీస్తుగా (మెస్సయ్య, రక్షకుడు) గుర్తించాడు. బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని స్తుతించాడు, “ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు. నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు” (2:29-32). అన్నమ్మ కూడా దేవునకు ధన్యవాదములు అర్పించింది. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగింది (2:38). ఎవరి హృదయాలైతే క్రీస్తు ప్రేమగల సాన్నిధ్యముచేత తాకబడతాయో, వారు రక్షణను పొందుతారు.
మనం ఏమి చేయాలి: జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు, మనముకూడా దేవునికి సమర్పించ బడినాము. అయితే, ప్రతీ దివ్యపూజా బలిలో మనలను మనం దేవునికి కానుకగా సమర్పించుకోవాలి. పవిత్రముగా జీవించాలి. మనం పరిశుద్ధాత్మ చేత నడిపింప బడాలి. పరిశుద్ధాత్మ, దేవుని ఉనికిని, సాన్నిధ్యాన్ని మనకు తెలియజేస్తుంది..
