పవిత్రాత్మ ఫలమైన ‘ఆనందము’

ఫాదర్ గోపు .ప్రవీణ్
13 Dec 2025
ఆగమనకాల 3వ ఆదివారము
యెషయ 35:1-6, 10;
యాకో. 5:7-10;
మత్త. 11:2-11
“ప్రభువు నందు మీరు ఎల్లప్పుడును ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను. ఆనందింపుడు!” (ఫిలిప్పీ. 4:4).
ఆగమన కాలములో క్రీస్తురాకకై ఎంతో ఆశగా ఎదురుచూచు చున్నాము. మనం ఎదురుచూసే సంఘటన సంతోషకరమైనది. అందుకే, నేటి ధ్యానాంశం: పవిత్రాత్మ ఫలమైన ‘ఆనందము’. ఈ ఆదివారము చాలా ప్రత్యేకమైనది, దీనిని GAUDETE SUNDAY అని అంటారు. ‘ఆనందించండి’ అని దీని అర్థము. “ప్రభువునందు మీరు ఎల్లప్పుడు ఆనందించుడి. మరల చెప్పుచున్నాను ఆనందించుడి” (ఫిలిప్పీ. 4:4) అను వచనము ఆధారముగా ఈరోజు దివ్యార్చన జరుపబడుతుంది. అందుకే ఆనందమునకు చిహ్నముగా గురువు గులాబిరంగు పూజావస్త్రము ధరిస్తారు. అదే రంగు ఆగమన కాల క్రొవ్వత్తి వెలిగించబడుతుంది. దీనిని ‘గొల్లల క్రొవ్వత్తి లేక ఆనందపు క్రొవ్యత్తి’ (Shepherd's Candle) అని అంటారు. ఆగమనకాల మొదటి ఆదివారము ప్రభువు మరల రానున్నాడు అనే ‘నమ్మకము’ను గురించి ధ్యానించి, రెండవ ఆదివారము, యెషయ ప్రవక్తద్వారా ప్రవచించబడిన దైవకుమారుడే బెత్లెహెములో జన్మించాడు అను ‘విశ్వాసము’ను బలపరచుకుని, “ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు, ఆయనలో ఉంటే కలదు ఆనందం” అని ధ్యానించమని ఈ మూడవ ఆగమనకాల ఆదివారమున, తల్లి శ్రీసభ మనలను ఆహ్వానించుచున్నది.
రాబోవు వాడవు నీవా! (మత్త. 11:3)
చెరసాలలోనున్న బప్తిస్మ యోహాను, క్రీస్తు కార్యకలాపములను, అనగా కొండమీద బోధనలు (మత్త. 5-7 అధ్యాయాలు), అద్భుతాలు (మత్త. 8-9 అధ్యాయాలు) గూర్చి విని, శిష్యులను యేసు వద్దకు పంపి, “రాబోవు వాడవు నీవా! లేక మేము మరియొకని కొరకు చూడవలెనా?” అని ప్రశ్నించాడు. ‘క్రీస్తు’ అనగా ‘అభిషిక్తుడు’ అని అర్ధము. హీబ్రూలో ‘మెస్సయా’ అని అర్ధము. పాత నిబంధనలో రాజులు, యాజకులు ప్రత్యేక విధినిర్వహణ కొరకు ఎన్నుకోబడి అభిషేకింపబడేవారు. యూదులు, రక్షణ కొనివచ్చు ‘మెస్సయా’ (అభిషిక్తుడు) కోసం ఎదురు చూసారు. అయితే, దావీదువలె గొప్ప రాజుగావస్తాడని భావించారు. ఈ నేపధ్యములోనే, యేసును, పైప్రశ్న అడగటం జరిగింది.
అయితే, ఇలాంటి ప్రశ్న బప్తిస్మ యోహాను అడగటం ఒకింత ఆశ్చర్యమే! ఎందుకన, “ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు” (3:3) అని ఎలుగెత్తి పలికాడు. యేసును వారించుచు, “నేనే నీచేత బప్తిస్మము పొందవలసిన వాడను. అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా?” (మత్త. 3:14) అని అన్నాడు. యేసు బప్తిస్మము పొందినప్పుడు, ఆకాశమునుండి వినిపించిన దివ్యవాణికి (మత్త. 3:17) యోహాను సాక్ష్యమయ్యాడు. యేసు తన వద్దకు వచ్చుట చూచి, “ఇదిగో! లోకపాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల” (యోహాను. 1:29) అని పలికాడు. అలాంటి యోహాను, “రాబోవు వాడవు నీవా?” అని యేసును ఎందుకు ప్రశ్నించాడు? కారణం, మెస్సయా గూర్చిన యూదుల అంచనాలు నెరవేరకపోవడం! (హింసలు, శ్రమలు రూపుమాపడం, పేదరికాన్ని నిర్మూలించడం, రోమనులను జయించి, నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం). అలాగే, యేసు యెరూషలేములోగాక, గలిలీయ ప్రాంతములో తన ప్రేషితకార్యమును కొనసాగించడం (మత్త. 4:12). ఈ నేపధ్యములో యేసు నిజముగా మెస్సయాయేనా అని యోహాను అడగటం జరిగింది.
సమాధానముగా యేసు, “పోయి, మీరు వినుచున్న దానిని, చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. కుష్టరోగులు శుద్దులగుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. మృతులు పునరుత్థానులగుచున్నారు. పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు” (మత్త. 11:4-6) అని ప్రత్యుత్తర మిచ్చారు. మొదటి పఠనములోని యెషయ ప్రవచనాలు (35:4-5) యేసు ప్రేషిత పరిచర్యలో నెరవేరాయి. యేసు మెస్సయాగా, తీర్పు తరువాత వచ్చు దేవుని కృప, దయను ముందుగానే స్వస్థత ప్రేషితకార్యముద్వారా తెలియజేయుచున్నాడు. హింసలను, శ్రమలను ప్రేమ, కరుణలతో జయిస్తున్నాడు (యుద్ధము, హింసతో కాదు). ప్రభువు చెప్పినట్లుగా, నేడు మనము సువార్తలో చెప్పబడిన దానిని వినాలి. యేసు క్రీస్తే సత్యము, దేవుని జ్ఞానము. క్రీస్తులో రక్షణకార్యము ప్రారంభమైనది. తన రెండవ రాకడతో అది పరిపూర్ణమవుతుంది.
