"పుణ్యక్రియలకు ప్రతిఫలం పరలోక రాజ్యమే"

జోసెఫ్ అవినాష్

02 Nov 2025

సామాన్య 31వ సోమవారం
రోమి 11:29-36
కీర్తన 69:30-31,33-34,36
లూకా 14:12-14
యేసుక్రీస్తు ప్రభువు సూచనలు మన ఆలోచనలకు
ఉంటాయి.మనం చేసే ప్రతి పనికి తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది.అది న్యాయమే కానీ,పరలోక రాజ్యంలో ప్రతిఫలం లభిస్తే ఎంత భాగ్యమోకదా! అలాంటి మాటలే యేసు ద్వారా వింటున్నాం. క్రీస్తుప్రభుని భోజనానికి ఆహ్వానించారు. తనను ఆహ్వానించిన వారికి మన స్వభావం ఎలా ఉండాలో నేర్పించాడు.మనల్ని తిరిగి ఆహ్వానించగలిగే వారిని మాత్రమే విందుకు ఆహ్వానిస్తే, దానిలో ప్రత్యేకత ఏముంటుంది? ఈ లోకంలోనే మనం ప్రతిఫలం ఆదుకుంటాం. కానీ పరలోక రాజ్యంలో ప్రతిఫలం లభించాలంటే,ఈ లోకంలో మనకు ఏమీ ఇవ్వలేని వారిని కూడా ఆదరించాలని ప్రభువు బోధించాడు.నిజమే కదా! వివాహ విందుల్లో, బంధుమిత్రులు మాత్రమే ఉంటారు. పుట్టినరోజు సంబరాల్లో సొంతవారు మాత్రమే కనిపిస్తారు. పండుగ పబ్బాల్లో మనకు ఇష్టమైన వారిని మాత్రమే ఆహ్వానిస్తాం. మన ఇంటిలో జరిగే ప్రతి ముఖ్య కార్యక్రమానికి, విందులు వినోదాలకు, ఎవరైతే మనల్ని తిరిగి ఆహ్వానిస్తారో వారికి మాత్రమే ఆహ్వానం పంపుతాం. ఇతరులను చిన్నచూపు చూస్తాం.అలా ప్రవర్తించడం సరికాదని ప్రభువు నేర్పిస్తున్నాడు.ఎంతోమంది పేదవారు,అనాథలు, నిరాశ్రయులు,ఆకలితో ఉన్నవారు,వృద్ధులు, వితంతువులు,వికలాంగులు, కుంటివారు, గ్రుడ్డివారు,మూగ చెవిటి వారు మన మధ్య ఉన్నారు.వారిని ఎవరూ పట్టించుకోరు.వారి గురించి ఆలోచించరు.వారు కూడా దేవుని బిడ్డలేనని గుర్తించరు. మనం చేసే పుణ్య క్రియలకు ఈ లోకంలోనే ప్రతిఫలం ఆశించక, పరలోక రాజ్యంలో ప్రతిఫలం లభించాలని ఆశిద్దాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN