పునీత లారెన్స్ స్మరణ

జోసెఫ్ అవినాష్
09 Aug 2025
రోమా శ్రీసభలో ప్రాముఖ్యతగాంచిన ఏడుగురు డీకన్స్లో పునీత లారెన్స్ గారు ముఖ్యలు.లారెన్స్ గారు 3వ శతాబ్దంలో సేవలందించారు. ఇతడు దేవుని ప్రేమను, పొరుగువారిన ప్రేమను తు.చ. తప్పక పాటించిన వ్యక్తి. అపోస్తులకార్యము 6వ అధ్యాయములో చూచినట్లయితే ఒక డీకన్ పేదలకు ఆహారమును వడ్డించుటకు నియమింపబడెను. పునీత లారెన్స్ గారు ఈ విషయమున చాలా శ్రద్ద చూపించి ఎంతో ఎనలేని సేవ చేస్తుండేవారు. లారెన్స్ గారు తన సేవయందు కనికరం కలిగి నిరుపేదలకు, అన్నార్తులకు తనకు ఉన్నదంతయు సంతోషంగా పంచి ఇచ్చారు. శ్రీసభకు చెందిన పూజాపాత్రలను అమ్మి పేదలకు పంచిపెట్టి వారిని సంతృప్తిపరచారు. ఆగస్టు నెల 258వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున రోమీయుల పాలకుడు చక్రవర్తి వలేరియన్ ఆజ్ఞానుసారం క్రైస్తవులను హింసించడం ప్రారంభించారు. ఇట్టి హింసలలో లారెన్స్ గారు వేదసాక్షిగా వీరమరణం పొందారు. ఇతని నామకార్ధం నిర్మించిన దేవాలయంలో పోపు డెమసున్ ఈ మాటలను ముద్రించారు. "కొరడా దెబ్బలకు, అగ్నికీలలకు, బంధించిన సంకెళ్ళకు భయపడక, విరవక, పునీత లారెన్స్ తన విశ్వాసం ద్వారా విజయుడయ్యెను" తన జీవితాన్ని దేవునికి రక్తబలిగా అర్పించడం ద్వారా విస్తారముగా ఫలించారు.
ఈ రోజు మనము విస్తారముగా ఫలించాలి అంటే ఉదారమైన మనస్సు చాలా అవసరం.అది లేనప్పుడు స్వార్ధం ప్రవేశించి మనలను ఫలింపనివ్వదు.పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని గ్రహించి వీరి మార్గంలో నడుస్తూ, దేవుడు ప్రసాదించిన ప్రేమను,పుణ్యఫలాలను తోటి ప్రజలతో పంచుకొని ఆయనకు ప్రియమైనవారిగా జీవించుదాం.