పంట విస్తారము కాని పనివారు తక్కువ

Fr. Sesetti Mariadas M.S.F.S.
05 Jul 2025
సామాన్య 14వ ఆదివారం
యెషయా 66:10-14
గలతీయులు 6:14-18;
లూకా 10:1-12
ఈనాటి సువిశేషంలో క్రీస్తు తన 72మంది శిష్యులను సువార్తను ప్రకటించుటకు పంపించును. క్రీస్తు ప్రధాన వాయిజ్యకారుడైతే శిష్యులు అతని చేతిలోని సంగీత వాయిజ్యములు. అందుకే క్రీస్తు ప్రభువు చదువులేని, శిష్యులను వేద ప్రచారానికై దేశనలుమూలల పంపించారు. క్రీస్తు వెళ్లబోవు ప్రతి ఊరికి, ప్రదేశమునకు తన కంటే ముందుగా వెళ్ళి తనకు మార్గము ఏర్పరుచుటకు వారిని పంపించారు. ఆ సందేశాన్ని అంగీకరించి అనుసరించు ప్రతి ఒక్కరికి రక్షణ లభించును. (యోహాను 1:11-12). మనకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. “ఆయన తనవారి యొద్దకు వచ్చెను. కాని తనవారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి, విశ్వసించు వారందరికి ఆయన దేవుని బిడ్డలగు భాగ్యంను ఇచ్చెను”.
క్రీస్తు 72 మంది శిష్యులను ఇద్దరిద్దరు చొప్పున పంపుతూ చెప్పిన మాటలు పరిశీలించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. శిష్యులు ఏమి బోధించవలెను? ఎలా బోధించవలయును? అని ఎంత మాత్రం భయపడ నక్కరలేదు. ఎందుకంటే పవిత్రాత్మ వారికి సర్వదా తోడుగ ఉంటుంది, వారిని ముందుకు నడిపిస్తుంది. అయితే దైవ వాక్య పరిచారకులు, దైవ రాజ్య స్థాపకులు కొన్ని నియమ నిబంధనములు పాటించవలసి ఉంది. అందులో కొన్నింటిని క్రీస్తు ఈనాటి సువిశేష పఠణం ద్వారా మనకు సూచిస్తున్నారు. మనము చేసే పనులు, చెప్పే మాటలకంటే గొప్పవిగా ఉండాలి. ఆదర్శవంతమైన ప్రవర్తన ద్వారా, మార్గదర్శకమైన జీవితం ద్వారా ఎన్నో ఆత్మలను రక్షించగలము.