శ్రీసభ రథసారథులు

జోసెఫ్ అవినాష్

28 Jun 2025

పునీత పేతురు,పౌలు గార్ల పండుగ
అపో.కా 12:1-11
తిమోతి 14:6-8,17-18
మత్తయి 16:13-19

ప్రతి ఏటా జూన్ 29న మనమంతా భక్తి, విశ్వాసాలతో పునీత పేతురు, పౌలు గార్ల మహోత్సవాన్ని జరుపుకొంటాము. వీరిద్దరు శ్రీసభకు, క్రైస్తవ విశ్వాసానికి పునాదిరాళ్ళు. వీరిద్దరూ రోమునగరంలో క్రైస్తవ విశ్వాసాన్ని వ్యాపించి, వేదసాక్షులుగా శత్రువుల చేతిలో మరణం పొందారు. వీరిద్దరు క్రీ.శ 67వ సంవత్సరంలో నీరో చక్రవర్తి హింసలకు గురియై యేసుక్రీస్తుకు, క్రైస్తవ విశ్వాసానికి సాక్షులుగా మరణించారు. పేతురు రోము నగరం యొక్క మొదటి పీఠాధిపతి. ఆపోస్తలుడుగా జీవించి, సువార్తబోధ చేసి, సిలువ మరణం పొందారు. తన గురువైన యేసుక్రీస్తువలె గాక, తలక్రిందులుగా సిలువపై కొట్టబడి, మరణం పొంది, వతికానులో భూస్థాపితం అయ్యాడు. పునీత పౌలు గూడ తన జీవిత ఆఖరి ఘట్టంలో ఒక బందీగా రోమాపురి చేరి, అచ్చట వేదవ్యాపకం చేసి, చివరకు శిరచ్చేదనం పొంది, రోము నగరం వెలుపల ఓస్తియా అనే ప్రదేశం వద్ద భూస్థాపితమయ్యాడు. మొదటి నుండి కైస్తవులు వీరిద్దరి సమాధులను దర్శించి, ప్రార్థనలు సలుపుతూ వచ్చారు. ఈ యిద్దరి అపోస్తలుల పండుగను కైస్తవులు చాల గొప్పగా, పాస్కా పండుగవలె జరుపుకొనేవారు.

పండుగ ప్రత్యేకత-:
ఈ పండుగ రోమునగరం యొక్క క్రైస్తవ జన్మదినోత్సవం ఇంతకుముందు అన్యదేవతలను కొలిచిన రోమునగరం పునీత పేతురు, పౌలుద్వారా  క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించింది.ఈ పండుగ సందర్భంలో ప్రాంతీయ  పీఠాధిపతులంతా రోము నగరానికి విచ్చేసి పాపు గారితో ఈ ఉత్సవాన్ని అతి పైభవంగా జరిపేవారు. క్రీస్తుజయంతి పండుగ సందర్భంలో జరిపినట్లే ఈ ఇద్దరి అపోస్తలుల పండుగనాడు మూడు స్థలాలలో మూడుపూజలు చేసేవారు, అనగా వతికానులోని పేతురు సమాధి వద్ద, ఓస్తియాలోని పౌలు సమాధి వద్ద, వీరిద్దరి మృతావశేషములు కొంతకాలం ఉంచబడ్డ భూగర్భ సమాధులవద్ద పూజా నైవేద్యాలు జరిపేవారు. ఈ యిద్దరి అపోస్తలులను విడదీయకుండా పండుగను జరిపేవారు. వీరిద్దరు శ్రీసభ ముఖానికి రెండు కన్నులవలె ఉన్నారు. జూన్ మాసం 29వ తేదీన ఈ పండుగను జరుపుకోటానికి ఒక ప్రత్యేక కారణముంది. రోమునగరంలో వలేరియన్ చక్రవర్తి కాలంలో  క్రైస్తవులపై హింసాకాండ జరుగుతున్నప్పుడు ఈ ఇద్దరు అపోస్తలుల మృతావ శేషాలను క్రైస్తవులు వారి సమాధులనుండి సురక్షితంగా వేరేచోటుకి తరలించారు.క్రైస్తవులు సమాధులను సందర్శించగూడదు అని చక్రవర్తి అజ్ఞయిచ్చాడు. సైనికులు సమాధుల వద్ద కాపలాకాయటం అరంభించారు. అట్టి సమయంలో క్రైస్తవ భక్తులు రహస్యంగా పేతురు, పౌలు సమాధులనుండి వారి మృతావశేషాలను తీసికొనిపోయి నగరానికి దూరంగా, సైనికులకు అగోచరంగా ఉన్న పునీత సెబాస్టియాను దేవాలయం క్రింద భూగర్భ సమాధుల వద్ద ఉంచి పూజా నైవేద్యాలను రహస్యంగా సమర్పించేవారు. ఇది జూన్ నెల 29వ తేదీన జరిగినట్లు సాంప్రదాయ పూర్వకంగా తెలుస్తుంది. మరల కొంతకాలమైన తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పుడు క్రైస్తవభక్తులు వీరి మృతావ శేషాలను వాటి పూర్వస్థానాలకు తరలించి, ఇద్దరి పండుగలు ఒకే రోజున జరుపుతూ వచ్చారు..

పేతురు ప్రాధాన్యత-:
పేతురు యేసుక్రీస్తు పన్నిద్దరి శిష్యులలో ప్రధానుడు. ఈదినం సువార్తా పఠనంలో యేసు పేతురుపైన తవ శ్రీసభను నిర్మిస్తానని చెప్పుతున్నాడు: "నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మిం చెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపుచెవులనిచ్చెదను.  భూలోకమందు నీవేమి బంధింతువో అవి పరలోకమందును బంధించబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అవి పరలోకమందును విప్పబడును" (మత్తయి 16:18-19) అని యేసు పలికాడు. యేసు పునరుత్థానుడైన తర్వాత పేతురును మూడుసార్లు. "నీవు నన్ను ప్రేమించుచున్నావా?" అని ప్రశ్నించి, "నా గొర్రెలను మేవుము" అని అతనిని శ్రీసభకు తలగా యేను నియమించాడు. శ్రీసభకు తలగా ఉంటూ, గొర్రెలను మేపుతూ, యేసుక్రీస్తుకు సాక్షిగా పేతురు ఎట్టి మరణాన్ని పొందుతాడో క్రీస్తు ముందుగానే చెప్పాడు. "నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు యువకుడవై యున్నప్పుడు నడుముగట్టి నీవు వెళ్ళదలచిన చోటుకు వెళ్లెడివాడవు కాని, నీవు వృద్ధుడపైనప్పుడు నీ చేతులు చాచెదవు. అపుడు వేరొకడు నిన్ను కట్టి వేసి నీవు వెళ్ళనిష్టపడని చోటుకు తీసుకొనిపోవును" (యోహాను 21: 15-19).

పేతురు సాక్ష్యం.
ఈ దినం మొదటి పఠనం పేతురు యేసుకు ఎలా సాక్ష్యమిచ్చాడో తెల్పుతుంది (అపో. కార్య. 12:1-11). పేతురు యేసుక్రీస్తుకు సాక్ష్యమివ్వటంలో పడిన కష్టాలను, బాధలను పరిశీలించినట్లయితే అతని జీవితం యేసుక్రీస్తు జీవితాన్ని పోలియున్నదని చెప్పవచ్చు. హేరోదు పులియని రొట్టెల పండుగ కాలంలో పేతురును పట్టి బంధించాడు. యేసు క్రీస్తునుగూడ అదే పండుగ కాలంలో పట్టి బంధించాడు (చదవగలరు: అపో. కార్య, 12:3; లూకా 22:7). పేతురును చెరసాలలో బంధించి, పాస్కాపండుగ గడచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు కొనిరాదలచాడు. యేసు విషయంలో గూడ అట్లే జరిగింది (చదవగలరు: ఆ.కార్య 12:4; మార్కు 14:2). పేతురు చెరసాలలో ఉన్నప్పుడు క్రైస్తవ సంఘం అతనికొరకు, పట్టుదలతో ప్రార్ధనలు సలిపింది, అట్లే యేసు ఒలివేతు తోపులో తన మరణాన్ని తలంచుకొని,రక్త స్వేదమును చేమర్చుతూ "తండ్రీ నీ చిత్తమైనచో ఈ పాత్రను నానుండి తొలగింపుము. కాని నా యిష్టముకాదు. నీ చిత్తమే నెర వేరునుగాక" (లూకా 22:43; అపో. కార్య. 12:5) అని ప్రార్ధించాడు. వారు చేసిన ప్రార్ధనను. ఒక దూతద్వారా దేవుడు ఆలకించాడు. "అపుడు స్వర్గమునుంచి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను" (లూకా 22:43) అని యేసును గూర్చి సువార్తా గ్రంథం పలుకుతుంది. అట్లే పేతురు విషయంలో కూడా క్రైస్తవ సంఘం చేసిన ప్రార్ధనను దేవుడు అలకించి ఒక దూతను పంపి, అతనిని చెరసాలనుండి విముక్తి చేశాడు (అపొ. కార్య. 12: 6–11). హింసాకాండను అనుభవిస్తున్న క్రైస్తవ సంఘం ఒలివేతు తోపులో యేసు ప్రార్థించినట్లు ప్రార్థలను జరిపింది. యేసువలె ఒక దూత ద్వారా బలాన్ని, ధైర్యాన్ని పొందింది. చివరకు పేతురుగూడ యేసు వలె సిలువ మరణం పొందాడు.

పౌలు సాక్ష్యం-:
పౌలు దమాస్కు వెళ్ళు దారిలో పరివర్తన చెంది, యేసుక్రీస్తు అపోస్తలుడుగా రూపొంది, ఎన్నోదేశాలు పర్యటించి, దేవుని వాక్కును బోధించి క్రైస్తవ సంఘాలను ఏర్పరచాడు. యూదుల మధ్యగాక ఎక్కువగా అన్య ప్రజలమధ్య సువార్త ప్రచారం చేసి వారిని క్రైస్తవులుగా మార్చాడు. తాను ఏర్పరచిన సంఘాలను తరచుగా సందర్శించి, వారిని ప్రోత్సహిస్తూ లేఖలనుగూడ వ్రాశాడు.సువార్త ప్రచారంలో ఎన్నో యిక్కట్టులకు, బాధలకు, హింసలకు పాలయ్యాడు. తను గురువైన యేసుక్రీస్తువలె శత్రువుల చేత దూషించబడ్డాడు, ప్రార్ధనా 'మందిరాల నుండి వెలివేయబడ్డాడు, హింసింపబడ్డాడు, చెర వేయబడ్డాడు. చివరకు శత్రువుల చేతిలో మరణానికి గురియయ్యాడు, అందుకే పౌలు, తన జీవితాన్ని గూర్చి ఈ దినం రెండవ పఠనంలో ఇలా పలుకుతున్నాడు: "నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను మంచి పోరాటమును పోరాడి, పరుగును ముగించితిని. విశ్వాసమును నిలుపుకొంటిని. నా కొరకై పందెపు జహుమానము  వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు. ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికందరికిని అనుగ్రహించును" (2.తిమోతి 4:6-8). పౌలు సువార్త ప్రచారానికై తన్నుతాను పూర్తిగా అంకితం చేసికొని తన జీవితాన్ని యేసువలె ఒక బలిగా అర్పించాడు. 'యేసును విడిచిపోయినట్లే పౌలునుగూడ ప్రజలు వీడిపోయారు (2 తిమోతి 4:16; మత్తయి 26:56), అయితే ప్రభువు అతనితోడు నిలిచి శక్తి నొనగాడు (2 తిమోతి 4:17) యేసు విషయంలో గూడ అట్లే జరిగింది. "ఇదిగో! మీరు నన్ను ఒంటరిగ వదిలి, చెల్లాచెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు సమయము వచ్చుచున్నది. అది వచ్చియేయున్నది. కాని నేను ఒంటరిగా లేను, ఏలయన తండ్రి నాతో ఉన్నాడు" (యోహాను16:32).

చివరిగా-:
పునీతులైన పేతురు,పౌలులు శ్రీ సభకు రెండు స్తంభాలుగా ఉన్నారు. ఈ రెండు స్తంభాల పైన శ్రీసభ నిర్మింపబడినది.. ఇరువురు క్రీస్తు వలె తమ జీవితాన్ని బలిగా అర్పించారు... పేతురు చాలాసార్లు పొరపాట్లు చేశారు.. కానీ తన తప్పులను తెలుసుకొని ప్రభువును ఆశ్రయించి క్షమాపణ కోరాడు ప్రభువు క్షమించి శ్రీసభకు నాయకుడిని చేశారు,పౌలు కత్తి ని పట్టి క్రైస్తవులను హింసించాడు కానీ ఏనాడైతే క్రీస్తు వెలుగు తన హృదయాన్ని తాకిందో ఆ క్షణం కత్తిని విడిచి కలాన్ని పట్టి ఎందరినో క్రీస్తు మార్గంలో నడిపించాడు సంఘాలను స్థాపించాడు.. మనం కూడా  వీరి వలె విశ్వాసముతో జీవిద్దాం క్రీస్తు బాటలో అడుగులు వేద్దాం అందరికీ పండుగ శుభాకాంక్షలు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN