నిజమైన సంపద పరలోకంలో ఉంది
జోసెఫ్ అవినాష్
20 Oct 2024
సామాన్య 29వ సోమవారం
సువిశేష ధ్యానం:
లూకా 12:13-21
ఈనాటి సువార్తలో ఒక వ్యక్తి ప్రభువు యొద్దకు వచ్చి, పిత్రార్జితములో నాకు పాలుపంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని అడిగినట్లు మనము చదువుతాము.అతని మనవి న్యాయమైనదిగా ఉన్నప్పటికీ యేసు ఆ వివాదములో పాల్గొనుటకు నిరాకరించెను. భూమి మీద కాక పరలోకములో ఆస్తిని సంపాదించు కొనగోరే వారికి సహాయము చేయుటకు మాత్రమే యేసు వచ్చెను.
ధనవంతుని ఉపమానంలో, ఇతడు కష్టజీవి, తన వృత్తిలో జ్ఞాని. విత్తనములు చల్లి, పంటను పండించి, కోసి దాన్యమును కొట్లలో పోసెను. అయితే దేవుని మరచెను. మనష్యుడు విత్తును, దేవుడు పంటను యిచ్చును. పంటను దేవుడే యిచ్చెనని యితడు మరచెను. తన ఆస్తిని యింకను అభివృద్ధి చేయకోరి, కొట్లను విప్పి, వాటికంటే గొప్పవాటిని కట్టించి, అందులో తన ఆస్తిని భద్రపరిచెను. ఈ లోకము శాశ్వతమని తలంచెను. తాను శరీరము కొరకే జీవింప కోరుచున్నాడు. సుభించుము, తీసుము, త్రాగుము, సంతోషించుమని చెప్పకొనెను. అయితే దేవుడు 'బుద్దిహీనుడా' అని అతనిని పిలిచెను. ధనవంతుడైన బుద్ధిహీనుడు ధనార్జనచేయుటలో బుద్ధిహీనుడు. న్యాయమైనరీతిని ఆర్జించుట పాపముకాదు, దానిని దేవుని కొరకు వినియోగింపక పోవుట పాపము. అతడు అనేక సంవత్సరములు జీవింతునని తలంచెను గాని ఒక రాత్రిమైనను జీవించలేదు. అది ధనవంతుని తలంపునకు విరుద్ధమైన గడియ. మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరి కోసం జీవిస్తున్నాను నేను అని? ప్రశ్నించుకోవాలి.