నా జీవితంలో అంతోని వారి మహిమలు
కొండవీటి అంతయ్య.సత్తెనపల్లి.
29 Jul 2024
గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణం, నేను ప్రస్తుతం ఉంటున్న సత్తెనపల్లికి 20 కిలోమీటర్ల దూరం. అక్కడ నా మూడో తమ్ముడు లూర్థు రాజు ఉంటున్నాడు.(నాకు ముగ్గురు అక్కలు నలుగురు తమ్ముళ్లు,ఒక చెల్లెలు ఉన్నారు లెండి) తమ్ముడు లూర్థు రాజు, మరదలు ఉషా రాణి ఇద్దరూ టీచర్లే. వాళ్లకు మనీషా అనే ఒక అమ్మాయి, లోకేష్ అనే ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళ అమ్మాయి మనీషా ఓణీల ఫంక్షన్ కి బంగారు వడ్డాణం చేయించారు.తర్వాత కొన్నాళ్ళకు, తమ అవసరాలకోసం ,ఆ వడ్డాణాన్ని నరసరావుపేట లోని 'చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు'లో కుదవ బెట్టి లోను తీసుకొన్నారు.
అది 2006 వ సంవత్సరం .డిసెంబరు మాసం24 వ తేదీ. ఆ రోజు మా తమ్ముడు వాళ్ళు వడ్డాణం కుదువ బెట్టిన బాంక్ లో దోపిడీ జరిగింది. దొంగలు బాంక్ లాకర్ ను గ్యాస్ కట్టర్లతో కరిగించి,దాన్ని పగలకొట్టి అందులో ఉన్న బంగారు నగలన్నీ దోచుకున్నారు.కస్టమర్లు కుదువ బెట్టిన సుమారు 46 కేజీల బంగారం పోయిందని , కొన్ని చిన్న చిన్న నగలు గ్యాస్ కట్టింగ్ ప్రభావానికి కరిగిపోయి ,గుర్తు పట్టలేని రూపం లో లాకర్ కు అతుక్కుని పోయాయని బాంక్ అధికారులు ప్రకటించారు.రికార్డుల ప్రకారం,కస్టమర్లు కుదువ బెట్టిన బంగారం బరువులో తరుగుపోను,వాళ్ళు బ్యాంకులో పెట్టిన రోజున ఉన్న రేటుకు తగ్గట్టుగా లెక్కించి ,బ్యాలన్స్ అమౌంట్ ను లోను తీర్చే రోజున చెల్లిస్తామని బాంక్ వాళ్ళు ఓదార్పు మాటలూ చెప్పారు. ఐతే, వాళ్ళు చెప్పినట్టు పాత రేటుతో ,తరుగుతో ఇస్తే నగలు పోగొట్టుకొన్న వాళ్లకు దక్కేది సగానికి సగమే! కాక పోతే గుడ్డిలో మెల్ల లాగా ఏదో కొంతైనా దక్కుతుందిలే అనుకుంటే అది జరిగేది ఎన్నాళ్లకో తెలియదు! అందాకా తూర్పు తిరిగి దండాలు పెడుతూ, బ్యాంకు వాళ్ళ చుట్టూ తిరిగి దస్కాలు పెడుతూ ఉండాల్సిందే!
ఆ రోజు ఆ విషయం తెలియగానే నా మరదలు ఉషారాణి "అయ్యో, శుభమాని అమ్మాయికి ఎంతో ఇష్టంగా చేయించిన వడ్డాణం పోయిందే" అనుకుంటూ ఇంట్లో ఆందోళన చెందుతూ కూర్చొని ఉందట. అప్పుడే మా రెండో అక్క ఫాతిమా రాణి వాళ్ళింటికి వచ్చిందట! ఉషారాణి చెప్పిన విషయం విని మా అక్క, " ఆందోళన ఎందుకు ఉషా! ఒక్క సారి అటు చూడు" అంటూ ఎదురుగా గోడకి తగిలించి ఉన్న అంథోని వారి ఫోటో చూపించి," పోయిన వస్తువులను తిరిగి తెప్పించే అంథోనివారిని వేడుకో! పోయిన వడ్డాణం తిరిగొచ్చి నీ ఒళ్లో పడుతుంద" ని చెప్పిందట. వెంటనే ఉషా రాణి అంథోని వారికి ప్రార్ధన చేసుకొని "5 మంగళ వారాలు గుడికి వచ్చి నీ పేరిట దివ్య పూజలు అర్పిస్తానయ్యా మా వడ్డాణం దొరికేటట్టు చేయయ్యా" అని మొక్కుకొన్నదట.
అన్నట్టు గానే మా తమ్ముడు మరదలు గుంటూరు ,నగరంపాలెంలో ఉన్న పునీత అంథోని వారి పుణ్య క్షేత్రానికి ప్రతి మంగళ వారం సాయంత్రం వెళ్లడం మొదలు పెట్టారు. ( ఆ పుణ్య క్షేత్రంలో ప్రతి మంగళ వారం సాయంత్రం జరిగే ప్రత్యేక ప్రార్థనలకు,పూజలకు వందలాదిమంది భక్తులు హాజరవుతూ ఉంటారు.)
అలా మూడు మంగళ వారాలు గడిచే సరికి జరిగింది అద్భుతం!!!
బాంక్ వాళ్ళ దగ్గిరనుంచి మా తమ్ముడికి కబురు వచ్చింది.'మీరు కుదువబెట్టిన వడ్డాణం బ్యాంకు లాకర్లో భద్రంగా ఉంది ,వచ్చి చూసుకోండి ' అని ఆ కబురు సారాంశం. వెంటనే మనసులో అంథోని వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా తమ్ముడూ, మరదలు బ్యాంకుకి వెళ్లారు.బ్యాంకు వాళ్ళు వీళ్ళను చూసి, "మీరు చాలా అదృష్టవంతులండీ, అన్నీ నగలు దొంగల పాలయినా, మీ వడ్డాణం ఉన్న సంచి మాత్రం ఆ లాకర్ అరకు వెనుక వైపున ఇరుక్కుని భద్రంగా ఉంది. దొంగలు గ్యాస్ కట్టర్ తో కోసి పగలగొట్టిన లాకర్ ను మెకానిక్ లు వచ్చి పరిశీలిస్తుంటే మీ వడ్డాణం బయట పడింది! ఎంతైనా మీ సొమ్ము గట్టిదండోయ్ " అన్నారట. ఓణీల ఫంక్షన్ కి కూతురికి చేయించిన వడ్డాణం చెక్కు చెదరకుండా తమకు దక్కడంతో ఆ రోజు మా తమ్ముడు,మరదలు ఎంత సంతోషించారో, అంథోని వారి మహిమను ఎన్ని నోళ్ళతో స్తుతించారో మాటల్లో చెప్పలేము.
ఎందుకో మరి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ హేతు వాదానికి కూడా అందని అద్భుతాలుగా అనిపిస్తూ, దైవ శక్తి మీద మనకు ఎనలేని నమ్మకంకలిగిస్తుంటాయి.
లేకపోతే,పోయిన వడ్డాణం తిరిగి దొరికేలా చేయమని మా వాళ్ళు అంథోని వారికి 5 మంగళ వారాలు మొక్కుకొని ప్రార్ధనలు చేయడమేమిటి?అన్ని నగలూ పోయాయని అధికారికంగా ప్రకటించిన బ్యాంకు వాళ్ళు,మూడు మంగళ వారాలు గడవగానే మీ వడ్డాణం పోలేదని కబురు చెయ్యడం ఏమిటి???ఇది అంథోని వారు చేసిన అద్భుతం కాదని అనగలమా మనం?