గుడి గంటలు మ్రోగిన వేళ
ఫాదర్. డా.సగినాల ప్రకాశ్
10 Jul 2024
గంటలు లేకుండా గుడిని ఊహించలేం! క్రీస్తు శకం 400. సంవత్సరంలో పౌలీమస్ అను భక్తుడు ఇటలీలోని నోలీ అను ప్రదేశములో ఒక దేవాలయ నిమిత్తం గంటలు మ్రోగించి ఈ ఆచారానికి ప్రనాది వేశాడు.ఆ తరువాత 604 వ సంవత్సరములో సలీనియామస్ అను పాపుగారు దీనిని ధృవీకరిస్తూ ఒక ప్రకటన చేశారు.అప్పటి నుండి గుడిగంటలు క్రైస్తవ ఆరాధనాక్రమంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. సాధారణంగా గుడిగంటలు ప్రార్ధనకు ఆహ్వానం పలుకుతాయి.కొన్ని పెద్ద దేవాలయాలలో గంటకు ఒక ప్రత్యేక గోపురం (BELL Tower) ఉంటుంది.రోజులో మూడుసార్లు ఈ గంటలను మ్రోగిస్తారు.ఉదయం6 గం॥కు, మధ్యాహ్నం 12 గం||లకు, సాయంత్రం 6 గం||లకు ఈ గంటల మ్రోగిస్తారు.ఆ సమయాలలో త్రికాల జపం చెప్పాలని ఈ గంటలు సూచిస్తాయి.త్రికాల జపం యేసుప్రభువు మనుష్యావతారాన్ని స్మరిస్తుంది.మొదట ఈ సమయాలలో పరలోక ప్రార్ధన చెప్పేవారిని కతోలిక శ్రీసభ సత్యోపదేశం No.2767 చెబుతోంది.ఈ అలవాటు ఇశ్రాయేలీయుల ప్రార్ధన ఆచారాన్ని బట్టి ఉండవచ్చు. దీనినే "Amidha" అని హీబ్రూ బాషలో పిలిచేవారు.
"ఉదయం, మధ్యాహ్నము, సాయంకాలము నేనతనికి ఫిర్యాదు చేయుదును", అంటుంది 55వ కీర్తన.దానియేలు మూడుమారులు దేవునికి ప్రార్ధన చేసినట్లు వ్రాయబడి ఉంది. (దానియేలు 6:10)
దివ్యబలిపూజలో దైవకుమారుడు పీఠం మీదకి వేంచేస్తున్న పరిశుద్ధ సమయం గురించి హెచ్చరిస్తూ చిన్ని గంటలు మ్రోగిస్తారు.వీటినే "సాంక్తుస్ బెల్స్ " (sanctus bells) అంటారు.క్రిస్మస్ రాత్రికి ముందు సాయంత్రం వేళ గుడి గంటలు మ్రోగిస్తూ ప్రభువు ఆగమనానికి స్వాగతం పలుకుతారు.కానీ అవే గంటలు ప్రభువు శ్రమలకాలంలో పెద్ద శుక్రవారం నుండి ఉత్థాన పండుగ వరకు మూగబోతాయి.అది ప్రభువు మరణ కారణంగా మనం చూపే దుఃఖాన్ని,బాధను వ్యక్తం చేస్తుంది.
విచారణలో చనిపోయిన వ్యక్తి గౌరవార్ధం గంటలు మ్రోగిస్తారు. ఇవి మూడు విధాలుగా ఉంటాయి.మొదట సమాచారం ప్రజలకు చేరవేస్తూ,నిదానంగా మధ్యలో తగినంత విరామంతో మ్రోగిస్తారు.రెండవది ఆ వ్యక్తి వయస్సును సూచిస్తూ అతనికి 75 సంవత్సరాలయితే 7 మార్లు మ్రోగిస్తారు.కొంచెం విరామం తరువాత 5 మార్లు మ్రోగిస్తారు.దీనిని బట్టి ఆ వ్యక్తి వయస్సు తెలియవస్తుంది. మనం రోజూవినే గుడి గంటలకు ఇంత ప్రాధాన్యత ఉంది మరి!