కారణజన్ముడు బాప్తిస్మ యోహాను

ఫాదర్. డా.సగినాల ప్రకాశ్

24 Jun 2024

తల్లి గర్భములోనే మెస్సయాను గుర్తించి ఆనందంతో గంతులు వేసిన బప్తిస్మ యోహాను కారణ జన్ముడు. వ్యక్తిత్వంలో మహిత గుణవంతుడు. ఆధ్యాత్మిక, నైతిక జీవితంలో మహా బలవంతుడు. సూర్యుని మించిన తేజంతో పవిత్రత గొప్పదనాన్ని,అవశ్యకతను ప్రజలకు చాటి చెప్పాడు. పరిశుద్ధుడైన దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు ఎలా ఉండాలో వివరించి చెప్పిన మహనీయుడు.ఆయన రౌద్రం అగ్నిని చిందించినా,హృదయం అమృతాన్ని చిలికింది.తన దగ్గరకు వచ్చిన ప్రజలు ఎలా జీవించాలో తెలియజెప్పాడు. పాపపు జీవితంలో ఉన్న ప్రజలకు బప్తిస్మ మిచ్చి, పవిత్ర జీవితానికి మరలమని హితవు పలికాడు. సమాజం నుండి మహాభిష్క్రమణం చేసినా, సామాజిక వ్యవస్థను జల్లెడతో పట్టి చూపగలిగాడు.ఎడారిలో ఉన్నా, సమాజంలోని మనిషి ఔన్యత్యాన్ని కోరుకున్నాడు. దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకున్నవాడై, ప్రజల పాప స్థితిని అసహ్యించుకొన్నాడు. ఈ వైఖరి మహాప్రవక్త అయిన మోషేలో కూడా కనిపిస్తుంది (చూడండి: నిర్గమ 20:18-21 మరియు 32:15-24). యోహాను జీవితం ఆద్యంతం వివాదాస్పదం.అయితే అది న్యాయ పోరాటంలో ఎదురయ్యే తప్పని పరిస్థితి. అందుకు యోహాను చింతించలేదు.ధర్మబాటను వీడలేదు.తప్పు చేసిన వాడు రాజైనా, పేదైనా దేవుని ముందు సమానమేనని నమ్మాడు.ఒక విధంగా యోహానును హేరోదు చంపించలేదు.యోహానే తన పవిత్రతతో హేరోదును చంపగలిగాడు.యోహాను ముందు మరణం ఓడిపోయింది.పరిశుద్ధత ముందు పాపం తుడిచి పెట్టుకుపోయింది.ఒక పవిత్రుని రాకను తెలియజేస్తూ,ఆ పవిత్రతకు తన ప్రాణంతో సాక్షమిచ్చిన యోహాను, మనుషులందరిలోకి అధికుడే మరి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN